ఏప్రిల్‌లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్‌టీ వసూళ్లు

ఏప్రిల్‌లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్‌టీ వసూళ్లు

ఏప్రిల్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రికార్డు గరిష్ఠానికి చేరాయి. ఏడాది క్రితంతో పోలిస్తే 12.4% పెరిగి రూ.2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా లావాదేవీలు 13.4% పెరగడం ఇందుకు కలిసొచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. 2017 జులైలో జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక, నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం.

2023 ఏప్రిల్‌ నాటి రూ.1.87 లక్షల కోట్లే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. రిఫండ్ల తర్వాత 2024 ఏప్రిల్‌లో నికర జీఎస్‌టీ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 17.1 శాతం పెరిగి రూ.1.92 లక్షల కోట్లుగా నమోదైంది.

ఏప్రిల్‌లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లలో సీజీఎస్‌టీ రూ.43,846 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.53,538 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.99,623 కోట్లుగా (దిగుమతులపై వసూలు చేసిన రూ.37,826 కోట్లతో కలిపి) నమోదైంది. సెస్సు వసూళ్లు రూ.13,260 కోట్లుగా ఉన్నాయి.

 ఐజీఎస్‌టీ నుంచి సీజీఎస్‌టీ కింద రూ.50,307 కోట్లు; ఎస్‌జీఎస్‌టీ కింద రూ.41,600 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ సర్దుబాటు అనంతరం ఏప్రిల్‌లో కేంద్ర, రాష్ట్రాల మొత్తం జీఎస్‌టీ ఆదాయం వరుసగా రూ.94,153కోట్లు; రూ.95,138 కోట్లుగా లెక్కతేలింది.

జీఎస్‌టీ నెలవారీ వసూళ్లలో టాప్‌-5

  • 2024 ఏప్రిల్‌ – రూ.2.10 లక్షల కోట్లు
  • 2023 ఏప్రిల్‌ – రూ.1.87 లక్షల కోట్లు
  • 2024 మార్చి – రూ.1.78 లక్షల కోట్లు
  • 2024 జనవరి – రూ.1.74 లక్షల కోట్లు
  • 2023 అక్టోబర్ – రూ.1.72 లక్షల కోట్లు

కాగా, 2024 మార్చి నెలకు గానూ రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు కొన్నాళ్ల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 11.5 శాతం మేర పెరిగాయి. మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.34,532 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.43,746 కోట్లు, ఐజీఎస్టీ రూ.87,947 కోట్లుగా ఉంది. సెస్సుల రూపంలో మరో రూ.12,259 కోట్లు వచ్చింది.