సూర్జేవాలాపై 48 గంటలు ప్రచార నిషేధం

బీజేపీ ఎంపీ హేమామాలినిపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలాపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది. 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని హేమామాలినిపై కాంగ్రెస్‌ అభ్యర్థి రణదీప్ సింగ్ సూర్జేవాలా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 

‘ప్రజలు తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజల గొంతును వారు పెంచుతారని. ఎన్నికై దాక్కున్న హేమామాలిని వంటి వారిని కాదు’ అని పేర్కొన్నారు. బీజేపీ షేర్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

దీంతో ఈ నెల 9న సుర్జేవాలాతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఫిర్యాదుదారులు ఆ వీడియో క్లిప్‌ను ఎడిట్‌ చేశారని సుర్జేవాలా ఆరోపించారు. హేమామాలినితో సహా ఏ మహిళను తాను అవమానించలేదని వివరణ ఇచ్చారు. సంతృప్తి చెందని ఈసీ 48 గంటలపాటు ప్రచారం చేయవద్దని సుర్జేవాలాను ఆదేశించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది

”భారత రాజ్యాంగంలోని 324వ అధికరణ, ఇతర అధికారాల కింద 16 ఏప్రిల్ 2024 సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ఎలాంటి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనరాదు. ఊరేగింపులు, పబ్లిక్ ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటర్వ్యూలు, మీడియాకు దూరంగా ఉండాలి” అని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.