లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో జలక్ తగిలింది. ఆదాయపన్ను శాఖ ఆ పార్టీకి రూ. 1700 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉన్నది. 2017-18 నుండి 2021-21 సంవత్సరాలకు సంబంధించి జరిమానా, వడ్డీ వసూలుకు రూ.1,823 కోట్ల మేర పన్ను నోటీసులు ఇచ్చింది.
తమపై ఐటీ విభాగం పన్ను మదింపు ప్రొసీడింగ్స్ను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు గురువారంనాడు కొట్టివేసిన వెంటనే తాజా పరిణామం చోటుచేసుకుంది. ఆదాయపు పన్ను అధికారులు రూ. 200 కోట్ల జరిమానా విధించి, ఖాతాలను స్తంభింపజేయడంతో కాంగ్రెస్ ఇప్పటికే తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోంది.
ఈ కేసులో హైకోర్టు నుంచి పార్టీకి ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ తమను ఆర్థికంగా దెబ్బతీస్తోందని, ఐటీ అధికారులను తమకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఫిబ్రవరిలో, పార్టీ పన్ను రిటర్న్లలో తప్పిదాలను గుర్తించిన ఐటీ అధికారులు రూ. 200 కోట్లు జరిమానా విధించారు. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ బకాయిలు చెల్లించాలని, వారి ఖాతాలను స్తంభింపజేయాలని ఆదేశించింది. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ఉత్తర్వులు రావడంతో తమ నిధులను స్తంభింపజేస్తూ ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వడం ‘ప్రజాస్వామ్యంపై దాడి’గా కాంగ్రెస్ అభివర్ణించింది.
నాలుగు ఆర్ధిక సంవత్సరాల పన్నుల పునః మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం తిరస్కరించింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడం అనేది ఈ ఎన్నికలలో ప్రధాన అంశంగా మారుతోంది.
ప్రత్యేకించి సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసిన తర్వాత వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది.
రూ.1,823.08 కోట్ల పన్ను నోటీసు అందుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ధ్రువీకరించింది. లోక్సభ ఎన్నికల వేళ ఆర్థికంగా నడ్డివిరిచేందుకు ‘టాక్స్ టెర్రరిజానికి’ బీజేపీ పాల్పడుతోందని తప్పుపట్టింది.
ఆదాయం పన్ను చట్టాల తీవ్ర ఉల్లంఘనకు పాల్పడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ఆక్షేపణ తెలిపారు. ‘ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్’ ద్వారా బీజేపీ రూ.8,200 కోట్లు వసూలు చేసిందని, ఇందుకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిండ్, పోస్ట్-రైడ్ బ్రైబ్స్, షెల్ కంపెనీల మార్గం తొక్కిందని జైరామ్ రమేష్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే తాము మాత్రం బెదిరేది లేదని చెప్పారు. పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని, పార్టీ హామీలను ప్రజల ముందుకు తీసుకు వెళ్తుందని చెప్పారు. ఆదాయం పన్ను విభాగం నోటీసులకు భయపడేది లేదని, మరింత పట్టుదలగా ఎన్నికల్లో పోరాటం సాగిస్తామని పేర్కొంటూ దీనపై త్వరలోనే సుప్రీంకోర్టును తమ పార్టీ ఆశ్రయిస్తుందని తెలిపారు.
More Stories
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం