హౌతీ క్షిపణి దాడి నుంచి 21 మందిని రక్షించిన భారత్

హౌతీ క్షిపణి దాడి నుంచి 21 మందిని రక్షించిన భారత్
హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్‌కు చెందిన 21 మంది సిబ్బందిని ఇండియన్‌ నేవీ రక్షించింది. వీరిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నాడు. గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో ఈ సంఘటన జరిగింది. బార్బడోస్ దేశానికి చెందిన బల్క్ క్యారియర్ ఎంవీ ట్రూ కాన్ఫిడెన్స్‌పై మార్చి6న హౌతీలు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారు.
దీంతో కార్గో పిష్‌లో మంటలు చెలరేగాయి.
ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఆ షిప్‌ ధ్వంసం కావడంతో అందులోని సిబ్బంది దానిని వీడారు. లైఫ్‌ బోట్లలో సముద్రంలో ప్రయాణించారు. తమను కాపాడాలంటూ అత్యవసర సందేశాలు పంపారు.  కాగా, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో భద్రత కోసం మోహరించిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా వెంటనే స్పందించింది. లైఫ్‌ బోట్లలో ఉన్న కార్గో షిప్‌ సిబ్బందిని కాపాడింది.
హెలికాప్టర్‌, బోట్లు ద్వారా వారిని నౌకలోకి చేర్చింది. గాయపడిన వారికి వెంటనే వైద్య చికిత్స అందించింది. అనంతరం వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చింది. హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్‌ సిబ్బందిని రక్షించిన వీడియో క్లిప్‌ను ఇండియన్‌ నేవీ షేర్‌ చేసింది.
 
కాగా, యెమెన్‌ లోని హౌతీ తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం జరుగుతున్న క్రమంలో హమాస్‌కు మద్దతుగా ఎర్ర సముద్రం మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ నౌకలకే నష్టం వాటిల్లింది. అయితే, హౌతీ రెబల్స్‌ జరుపుతున్న దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి.

గ్రీస్‌ యాజమాన్యానికి చెందిన ‘ట్రూ కాన్ఫిడెన్స్‌’ కార్గో నౌక బార్బడోస్‌ జెండాతో చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తోంది. ఆ నౌకపై గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో కార్గో నౌక తీవ్రంగా దెబ్బతినింది. ఈ ఘటనలో ముగ్గరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించారు.

ఘటన జరిగిన సమయంలో నౌకలో సుమారు 20 మంది సిబ్బంది, ముగ్గురు సాయుధ గార్డులు ఉన్నట్లు తెలిసింది. వారిలో భారత్‌కు చెందిన ఒకరు, వియత్నాంకు చెందిన నలుగురు, ఫిలిప్పీన్స్‌కు చెందిన 15 మంది సిబ్బంది ఉన్నట్లు నౌక యాజమాన్యం తెలిపింది. యెమెన్‌ నగరం ఎడెన్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంది.