రష్యా కోసం పోరాడుతూ మరణించిన హైదరాబాదీ

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న దండయాత్రలో హైదరాబాద్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం రష్యా వెళ్లి, ఏజెంట్ చేతిలో మోసపోయిన 30 ఏళ్ల మహ్మద్ అఫ్సాన్.. బలవంతంగా మాస్కో సైన్యంలో చేరాల్సి వచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లో హెల్పర్ ఉద్యోగం ఉందంటూ మాస్కోకు తీసుకెళ్లిన ఏజెంట్ చివరకు చేతులెత్తేశాడు. 
 
దీంతో రష్యన్ సైన్యంలో చేరి, ఉక్రెయిన్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్ దళాల దాడిలో అఫ్సాన్ చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ  బలవంతంగా రష్యా ఆర్మీలో చేరుతోన్న భారతీయ యువకులను రక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
 
కాగా, ఆ యువకుడి మరణాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం కూడా ధృవీకరించింది. అతని మృతదేహాన్ని స్వదేశంకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఆ యువకునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతరులు పలువురితో పాటు అస్ఫాన్‌ను మోసపూరిత ఏజెంట్లు తప్పుదోవ పట్టించి, యుద్ధంలో రష్యా సైన్యానికి సాయంగా ‘హెల్పర్లు’గా రిక్రూట్ చేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో ప్రస్తుతం సాగుతున్న పోరులో రష్యన్ సైన్యంలో ‘హెల్పర్’గా పని చేస్తున్న గుజరాత్‌కు చెందిన 23 ఏళ్ల వ్యక్తి రష్యాలో మరణించిన కొన్ని వారాల తరువాత తాజా మృతి వార్త వచ్చింది. 

సూరత్‌కు చెందిన హామిల్ మంగుకియాగా గుర్తించిన ఆ వ్యక్తి ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా రష్యాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసి, చెన్నై నుంచి మాస్కో చేరాడు. అతనిని రష్యన్ సైన్యంలో ఒక అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెట్‌స్క్ ప్రాంతంలో ఫిబ్రవరి 21న ఉక్రెయిన్ వైమానిక దాడిలో మంగుకియా మరణించాడు. 

రష్యన్ సైన్యంలో భద్రత హెల్పర్లుగా పని చేసేలా పలువురు భారతీయులను మోసగించారు. సరిహద్దు ప్రాంతాలలో ఉక్రెయిన్ సైనికులతో పోరాడేందుకు కొందరిని బలవంతం చేసినట్లు మీడియా వార్తలు సూచించాయి. మీడియా వార్తలకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ క్రితం నెల స్పందిస్తూ, రష్యన్ సైన్యానికి అనుబంధ సిబ్బందిగా పని చేస్తున్న భారత జాతీయులను ‘త్వరగా విముక్తం చేసేలా’ భారత ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని తెలియజేసింది.

‘రష్యన్ సైన్యానికి అనుబంధ సిబ్బందిగా లేదా హెల్పర్లుగా పని చేసేందుకు అక్కడికి సుమారు 20 మంది వెళ్లారని మా అవగాహన’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఫిబ్రవరి 29న విలేకరుల గోష్ఠిలో వెల్లడించారు. ‘వారిని త్వరగా విడుదల చేయించేందుకు మేము శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. 

భారతీయులు తిరిగి వచ్చేలా చూసేందుకు న్యూఢిల్లీలోను, మాస్కోలోను రష్యన్ అధికారులను భారత్ ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నదని కూడా జైశ్వాల్ తెలియజేశారు. ఉద్యోగాల పేరుతో మోసపోయిన భారతీయ యువకులు రష్యన్ సైన్యంలో బలవంతంగా చేరాల్సి వస్తోందని గతంలో ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వారిని రక్షించాలని కోరారు. తన సోదరుడిని వెతుక్కుంటూ మాస్కోకు వెళ్లి తిరిగి ఇంటికి తీసుకురావాలని భావిస్తున్నట్లు అఫ్సాన్ సోదరుడు ఇమ్రాన్ ఇటీవల ప్రకటించారు. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన అఫ్సాన్.. రష్యా వెళ్లడానికి ముందు ఓ మెన్స్ షోరూంలో పనిచేశాడు.