52 ఏళ్ల తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన అమెరికా

52 ఏళ్ల తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన అమెరికా
అమెరికా 52 ఏళ్ల తర్వాత చంద్రుడిపై మరోసారి అడుగుపెట్టింది. అమెరికా కంపెనీ ‘ఇంటూటివ్ మెషీన్స్‌’కు చెందిన తొలి లూనార్ ల్యాండర్ ‘ఒడిస్సియస్’ చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండర్ ఒడిస్సియస్ అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6:23 గంటల సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. 
 
నాసా, ఇతర కమర్షియల్ కంపెనీలకు చెందిన పరికరాలను ఒడిస్సియస్ చంద్రుడిపైకి మోసుకెళ్లింది. కాగా అమెరికాకు చెందిన చివరి మూన్ ల్యాండింగ్ మిషన్ 1972 డిసెంబర్‌లో జరిగింది. అపోలో మిషన్‌లో భాగంగా ‘అపోలో-17’ అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది.  అయితే ల్యాండర్‌ నుండి వచ్చే సిగల్స్‌ బలహీనంగా ఉన్నాయని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ (ఐఎం) తెలిపింది.
 
 దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌ను దింపాలని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. వారం రోజుల పాటు పనిచేసేలా ఈ ల్యాండర్‌ను రూపొందించారు. దీంతో చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ని ప్రయోగించిన మొదటి ప్రైవేటు కంపెనీగా ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ నిలిచింది.
 
కాగా ఫ్లోరిడాలోని నాసా ‘కెన్నెడీ స్పేస్ సెంటర్’ నుంచి గత గురువారం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ ద్వారా అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఐఎం-1 పేరుతో ఈ మిషన్‌ను నిర్వహించారు.  స్పాటి కమ్యూనికేన్‌ ఉన్నప్పటికీ క్రాఫ్ట్‌ను నిర్వహించే సంస్థ ఇంట్యూటివ్‌ మిషన్‌ గతవారం ప్రయోగించిన ల్యాండర్‌ చంద్రునిపై దిగినట్లు ధ్రువీకరించింది. 
 
అయితే ల్యాండర్‌ ప్రస్తుత పరిస్థితి, ఖచ్చితమైన స్థానం గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ల్యాండింగ్‌ను నిర్థారించిన వెంటనే కంపెనీ ప్రత్యక్ష ప్రసార వెబ్‌కాస్ట్‌ను నిలిపివేసింది. ఒడిస్పియస్‌ అని పిలిచే ఈ ల్యాండర్‌ ల్యాండ్‌ అయిన తర్వాత కంపెనీకి చెందిన హ్యూస్టన్‌ కమాండ్‌ సెంటర్‌లో గందరగోళం ఏర్పడిందని మిషన్‌ డైరెక్టర్‌ క్రెయిన్‌ తెలిపారు. 
 
కంట్రోలర్‌లు సుమారు 25,000 మైళ్ల (4,00,000 కి.మీ) దూరంలో ఉన్న అంతరిక్ష నౌక నుండి సిగల్‌ కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. 15 నిమిషాల తర్వాత ల్యాండర్‌ నుండి బలహీనమైన సంకేతాలు అందాయని, సిగల్స్‌ను ఎలా మెరుగుపరచాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.ఈ ప్రయోగం కోసం ఇంట్యూటివ్‌కు నాసా 118 మిలియన్‌ డాలర్ల నిధులను సమకూర్చినట్లు పేర్కొన్నారు. రోదసీ యాత్రలను వాణిజ్యీకరించడంలో భాగంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపారు. 1972లో అపోలో మిషన్‌ తర్వాత నాసా చేపట్టిన ల్యాండింగ్‌ ఇదేనని పేర్కొన్నారు. గత నెలలో ఆస్ట్రోబోటిక్‌ ప్రయోగాన్ని చేపట్టినప్పటికీ అది విఫలమైన సంగతి తెలిసిందే.

చంద్రుడి ఉపరితల పరస్పర చర్యలు, వాతావరణ చర్యలు, రేడియో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ల్యాండింగ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, నావిగేషన్‌కు సంబంధించిన సామర్థ్యాలపై కూడా పరిశీలనలు చేయనున్నట్టు నాసా రిపోర్టులు చెబుతున్నాయి. కాగా చంద్రుడిపై పరిశోధనల కోసం పలు అమెరికా కంపెనీలతో నాసా కలిసి పనిచేస్తోంది.