రైల్వే జోన్ కు భూములివ్వని ఏపీ ప్రభుత్వం

విశాఖలో రైల్వే జోన్ నిర్మాణానికి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రకటించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ జోన్ కోసం 53 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని, ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్ కూడా సిద్ధమైందని చెప్పారు.

మరోవంక, మధ్యంత‌ర బ‌డ్జెట్‌లో రైల్వేల‌కు అసాధార‌ణ రీతిలో రూ. 2.52 లక్షల కోట్ల బ‌డ్జెట్ కేటాయింపులున్నాయ‌ని అశ్వ‌నీ వైష్ణ‌వ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ. 14,209 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  ప్రస్తుత బడ్జెట్ లో ఏపీకి రూ.9,138 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రూ.886 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే ప్రస్తుతం ఏపీకి పది రెట్లు అధికంగా బడ్జెట్ కేటాయింపులు జరిగినట్టు వెల్లడించారు. 

ఏపీలో 97 శాతం రైల్వే లైన్లు విద్యుద్దీకరణ చేసినట్లు వివరించారు. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.68,059 ఖర్చు చేస్తోందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఏపీలో 72 రైల్వే స్టేషన్లను ‘అమృత్’ స్థాయి స్టేషన్లుగా ఆధునికీకరిస్తున్నట్టు తెలిపారు. 2014 నుంచి 7,009 ఫ్లైఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడాదికి 240 కిలోమీటర్ల మేర ట్రాక్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

కాగా, ప్రస్తుత బడ్జెట్ లో తెలంగాణలో రైల్వే కోసం రూ. 5071 కోట్లు కేటాయించామని,  తెలంగాణలో 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయిందని తెలిపారు. తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని ఆయన వెల్లడించారు.