10 గంటలకు ‘మంగళ ధ్వని’తో ప్రాణ ప్రతిష్ట ప్రారంభం

ఎన్నో శతాబ్దాల కల సాకారం కాబోతున్నది. జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరంలో స్వామివారి సాక్షాత్కరం కాబోతున్నది. ఇందుకు శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది.  భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచ దేశాలు ప్రాణ ప్రతిష్ఠ చారిత్రక ఘట్టం కోసం ఎదురుచూస్తున్నది. 

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి ‘మంగళ ధ్వని’తో మొదలవుతుంది.  దాదాపు రెండు గంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికి పైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనం అర్పించనున్నారు.

న్యూఢిల్లీలోని కేంద్రీయ సంగీత నాటక అకాడమీ సహకారంతో యతీంద్ర మిశ్రా సంగీత ప్రదర్శన జరుగనున్నది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత వాయిద్యాలతో ప్రదర్శన ఉంటుంది.  యూపీ నుంచి పఖావాబ్, బాన్సూర్‌, ధోలక్‌, ఒడిశా నుంచి మర్దల్‌, కర్నాటక నుంచి వీణ, మధ్యప్రదేశ్‌ నుంచి సంతూర్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఘటం (కుండలతో సంగీతం వాయించడం), జార్ఖండ్‌ నుంచి సితార్‌, తమిళనాడు నుంచి నాదస్వరం, తవిల్‌, మృందంగం తదితర సంగీత వాయిద్యాలతో రాముడికి నీరాజనం అర్పించనున్నారు.

ప్రాణ ప్రతిష్ఠకు దేశ విదేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు. రాత్రి 10.30 గంటలకు రామజన్మభూమి కాంప్లెక్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం జారీ చేసే అడ్మిట్ కార్డు ద్వారానే ప్రవేశం ఉంటుంది. అతిథులకు కేవలం ఆహ్వాన పత్రిక ద్వారా మాత్రమే ప్రవేశం  ఉండదు. ఎంట్రీ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్‌తో సరిపోలితేనే కాంప్లెక్స్‌లోకి ప్రవేశం ఉంటుంది.

12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ట

సోమవారం మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ అభిజీత్ ముహూర్తంలో ప్రారంభిస్తారు. కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించారు.  అభిజిత్ ముహూర్తం, ఇంద్రయోగం, మృగశిర నక్షత్రం, మేష లగ్నం, వృశ్చిక నవాంశలలో పౌషమాస ద్వాదశి తిథి (22 జనవరి 2024)న జరుగుతుంది. శుభ ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 32 సెకన్ల వరకు ఉంటుంది. 

అంటే ప్రాణ ప్రతిష్టకు శుభముహూర్తం 84 సెకన్లు మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ్‌లల్లా విగ్రహానికి ప్రతిష్ఠాపన చేయనున్నారు. కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది పండితులు ఈ క్రతువును నిర్వహిస్తారు. 150కిపైగా సంప్రదాయాలు, 50కిపైగా గిరిజన, తీర, ద్వీపం, తదితర సంప్రదాయాలకు చెందిన సాధువులు, ప్రముఖులు హాజరుకానున్నారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తవుతుందని వెల్లడించారు. 

పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ సందేశం ఇవ్వనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశీస్సులు అందజేయనున్నారు.

ప్రధాని మోదీ నాలుగు గంటల పాటు అయోధ్యలోనే ఉండనున్నారు. ఉదయం 10.25 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి, 10.55 గంటలకు రామజన్మభూమికి చేరుకుంటారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 1 గంటకు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2.10 గంటలకు కుబేర్ తిలాను సందర్శించిన తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ‘రామజ్యోతి’ వెలిగించి దీపావళిని జరుపనున్నారు. సాయంత్రం 10 లక్షల దీపాలతో అయోధ్య వెలిగిపోతుంది. ఇళ్లు, దుకాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ‘రామజ్యోతి’ వెలుగనున్నది. సరయూ నది ఒడ్డున దీపాలతో కాంతులీననున్నది.  రాంలాల్లా, కనక్ భవన్, హనుమాన్‌ఘర్హి, గుప్తర్‌ఘాట్, సరయూ బీచ్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ కంటోన్మెంట్ సహా వంద దేవాలయాలు, ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాలలో రామజ్యోతి వెలిగించనున్నారు.