మార్చి 15లోగా భారత్ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి

మార్చి 15లోగా భారత్ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి
చైనా అనుకూల నేతగా పేరొంది, గత ఏడాది మాల్దీవుల అధ్యక్షుడుగా ఎన్నికైన్నప్పటి నుండి భారత్ పట్ల ప్రతికూల ధోరణి ఆవలంభిస్తున్న  మొహమ్మద్ ముయిజు ఇటీవల ఐదురోజుల చైనా పర్యటన అనంతరం భారత్ పట్ల కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. పైగా, ఇదే సమయంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన అలజడి చెలరేగడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
 
మాల్దీవుల్లో మోహరించిన తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత్‌ను కోరింది. ఇంతకు ముందు మార్చిలో 15లోగా మాల్దీవుల్లో మోహరించిన బలగాలను ఉపసంహరించుకోవాలని కోరినట్లు దేశాల పేర్లను ప్రస్తావించకుండా అధ్యక్షుడు ముయిజు పేర్కొన్నారు. ముయిజు ఎన్నికల్లోనూ ఆయన భారత్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పలు వ్యాఖ్యలు చేశారు. 
 
మాల్దీవులను బెదిరించే హక్కు ఏ దేశానికి లేదని ఇంతకు ముందు భారత్‌ పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యనించారు. అయితే, మార్చి 15లోగా తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని అధ్యక్షుడు ముయిజు అధికారికంగా భారత్‌ను కోరినట్లు మాల్దీవుల ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ముయిజు చైనా పర్యటన ముగించుకొని వచ్చిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. 

ముయిజ్జు కార్యాలయంలో కార్యదర్శి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం మాట్లాడుతూ భారత సైనిక సిబ్బంది మాల్దీవుల్లో ఉండలేరని, ఇది అధ్యక్షుడు ముయిజు ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మాల్దీవుల్లో 88 మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు. మాల్దీవుల్లో భారత దళాల ఉపసంహరణపై చర్చించేందుకు ఉన్న స్థాయి కోర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.

గ్రూప్‌ తొలి సమావేశం ఆదివారం ఉదయం మాలేలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. సమావేశంలో భారత హైకమిషనర్ మును మహవార్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ ముయిజు కార్యాలయంలోని కార్యదర్శి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం సైతం సమావేశాన్ని ధ్రువీకరించారు. మార్చి 15లోగా బలగాలను ఉపసంహరించుకోవాలనే అభ్యర్థన అజెండానే సమావేశం జరిగిందని పేర్కొన్నారు. అయితే, భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.

గత ఏడాది నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని అధికారికంగా భారతదేశాన్ని మొయిజు అభ్యర్థించారు. మాల్దీవుల దేశీయ వ్యవహారాలపై ఎలాంటి బయటి దేశాలు ప్రభావం చూపడాన్ని తాను అనుమతించబోనని చెప్పారు.  గత ప్రభుత్వ హయాంలో కుదిరిన 100కు పైగా ద్వైపాక్షిక ఒప్పందాలను సమీక్షిస్తామని కూడా ప్రకటించారు. దీంతో రెండుదేశాల మధ్య ఉద్రికత్తలు పెరిగే అవకాశం ఉన్నది. 

ఇటీవల మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు ప్రధాని మోదీపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఘటన తర్వాత సోషల్ మీడియాలో దుమారం రేగింది. టూరిజంపైనే ఆధారపడ్డ మాల్దీవులను బహిష్కరించాలని భారతీయ నెటిజన్లు పిలుపునిచ్చారు. మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌కు వెళ్లాలని పిలుపునిచ్చారు.