తెలంగాణాలో పెట్టుబడులకు అదానీ ఆసక్తి

* ఏరో స్పేస్ పార్క్, డేటా సెంటర్ ల ఏర్పాటు!
 
తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోసారి ముందుకు వచ్చింది. బుధవారం సెక్రెటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో పోర్ట్స్- సెజ్ సీఈవో, గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరో స్పేస్ సీఈవో ఆశీష్ రాజ్ వన్షీలతో చర్చలు జరిపారు. 
 
పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. 
 
ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు. 
 
అదానీ గ్రూపులో ఉన్న ప్రతి కంపెనీల బ్రాంచ్‌లను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఉత్సాహంగా ఉన్నామని కరణ్ అదానీ అన్నారని కొందరు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
 
మరోవంక, తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతుంది.  ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై చర్చలు జరిపారు.