
వచ్చే ఎన్నికల్లో తమ వ్యూహం తమకు ఉందని చెబుతూ ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలపై ఓ ప్రణాళిక సిద్ధంగా ఉందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆమె బుధవారం నాడు అమలాపురంలో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడినుండి పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. మరోవైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తివాదులు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి వస్తే ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్నికలలో తమ వ్యూహం మాకు ఉందని అంటూ రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని పురందేశ్వరి ఆరోపించారు. నాడు చంద్రన్న, నేడు జగనన్న అంటూ స్టికర్ అంటించి ప్రచారం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబంలో ఒక్కరికే వైద్యం అందిస్తున్నారన కానీ, ఆయుష్మాన్ భవ పథకం క్రింద కేంద్రం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల వరకు ఇస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
రాజమండ్రిలో మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ హాస్పిటల్, మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం జలజీవన్ మిషన్ కింద 6000 కుళాయి కనెక్షన్లు ఇచ్చిందని పురందేశ్వరి గుర్తు చేశారు. టూరిజం అభివృద్ధి కోసం రాజమండ్రి నుంచి లంబసింగి హైవే వేస్తున్నామని తెలిపారు.
కేంద్రం ఇచ్చిన డబ్బులను జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పంచుతున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు.
ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులను ధ్వంసం చేస్తున్నారని పురందేశ్వరి తెలిపారు. ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభమై అవినీతిలో కూరుకుపోయిందని ఆమె ధ్వజమెత్తారు. ఇక, రాష్ట్రానికే కాకుండా జిల్లాల వారీగా కేంద్ర సహకారం అందిస్తుని ఆమె చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నమైన స్థితిలో ఉందన్నారు. రాష్ట్రంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయన్న ఆమె చంద్రయాన్ తీసిన మొదటి ఫోటోలో రోడ్డు దుస్థితి కనపడిందని అంటూ ఎద్దేవా చేశారు.
More Stories
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి