‘వీర్ బాల్ దివస్’.. గురుగోవింద్ సింగ్ పోరాటం చాలా గొప్పది

‘వీర్ బాల్ దివస్’.. గురుగోవింద్ సింగ్ పోరాటం చాలా గొప్పది

గురుగోవింద్ సింగ్ పోరాటం చాలా గొప్పదని.. వారి కుమారుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం వీర్ బాల్ దినోత్సవం సందర్భంగా అమీర్‌పేటలోని గురుద్వార్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… పదో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన.. బాబా జోరావర్ సింగ్ (9 ఏళ్లు), బాబా ఫతే సింగ్ (6 ఏళ్లు) ధర్మ కోసం బలిదానం అయ్యారని.. వారి పెద్ద కుమారులు సైతం మొఘల్ సైన్యంతో పోరాటం చేసి ధర్మం కోసం బలిదానం చేశారని చెప్పారు. చివరకు గురు గోవింద్ సింగ్ ఇద్దరు పుత్రులు కూడా ఔరంగజేబు సైన్యం బంధించి సిక్కు మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేసిందన్నారు. ఇస్లాంను స్వీకరించాలి, సిక్కు మతాన్ని వదిలేయాలని అనేక రకాలుగా వేధింపులకు, దౌర్జన్యాలకు గురిచేశారని కిషన్‌రెడ్డి తెలిపారు.మతం మారే ప్రసక్తే లేదని ఆ ఇద్దరు పసిపిల్లలు ఔరంగజేబుకు, మొఘల్ సైన్యానికి సవాల్ విసిరారని చెప్పారు. చివరకు ఆ ఇద్దరు పసిపిల్లలను నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలతో సమాధి చేసి వారిని బలిగొన్నారని.. వారి త్యాగనిరతికి స్ఫూర్తిగా డిసెంబరు 25వ తేదీన ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘‘వీర్ బాల్ దివస్’’ నిర్వహించాలని దేశమంతా వేలాది కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.