కేసీఆర్‌ కుటుంబం పాస్‌పోర్టులు సీజ్ చేయాలి

కేసీఆర్‌ కుటుంబం పాస్‌పోర్టులు సీజ్ చేయాలి
అధికారంలో ఉన్నన్ని రోజులు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని హెచ్చరించారు. 
 
కేసీఆర్ హయాంలో పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన అధికారుల పాస్ పోర్టులను కూడా సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్‌ను ఈ విషయంలో మినహాయించాలని సూచించారు. కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్‌లో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
కేసీఆర్ మినహా ఓడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకుతిన్నారని పేర్కొంటూ వెంటనే వాళ్ల అవినీతిని బయటపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 
 
బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో తెలంగాణను పెట్టామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు చెబుతుండటాన్ని సంజయ్ తీవ్ర స్తాయిలో తప్పుబట్టారు. తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఒకటో తేదీకే జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు.  రూ. 6 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను సర్వనాశనం ఎందుకు చేశారని నిలదీశారు.
ప్రభుత్వ భూములన్నీ ఎందుకు అమ్ముకున్నారని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకివ్వలేదని, నిరుద్యోగ భ్రుతి ఎందుకివ్వలేదని అడిగారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని చెబుతూ దేశమంతా మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ గాలి వీస్తోందని, 350 ఎంపీ స్థానాలతో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని సర్వే సంస్థలు చెబుతున్నాయని తెలిపారు.
తెలంగాణలోనూ మోదీగాలి వీస్తోందని పేర్కొంటూ మనకు పోటీ కాంగ్రెస్ మాత్రమే అని చెప్పారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సోదిలో కూడా ఉండదని  తేల్చి చెప్పారు. మనం చేయాల్సిందల్లా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ్రుద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఇంటింటికీ తీసుకెళ్లడమే అని తెలిపారు. ఈ విషయంలో కొంత వెనుకబడ్డామని చెబుతూ ఇకపై ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని కోరారు.