2008 నవంబర్ 26వ తేదీ.. ఎప్పటిలానే దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా సూర్యోదయం అయ్యింది. ఉరుకులు పరుగుల జీవితంలో అందరూ బిజీగా అయిపోయారు. ముంబైకి ఠీవిగా నిలిచే సముద్రం నుంచి ఆ రోజు రాత్రి మృత్యుదేవత ముంచుకొస్తుందని ఎవరూ ఊహించలేదు. పాకిస్థానీ ప్రేరేపితి లష్కర్ ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి దేశ ఆర్థిక రాజధాని ముంబై విలవిల్లాడిన రోజు అది. ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం పది మంది ఉగ్రవాదులు దేశ ఆర్ధిక రాజధానిలో మారణహోమాన్ని సృష్టించారు. ఈ దారుణ సంఘటనకు ఇవాళ్టితో 15 ఏళ్లు పూర్తయ్యాయి.
ముంబై తీరంలోని కొలాబా సముద్రమార్గం ద్వారా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోని వేర్వేరు ప్రాంతాలకు చేరుకున్నారు. ఏకకాలంలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్లు, ఒక హాస్పిటల్, రైల్వే స్టేషన్, యూదుల కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దారుణ మారణకాండకు తెగబడ్డారు. ఓ భారతీయ పడవను హైజాక్ చేసి అందులో వారిని చంపేశారు. ఏకకాలంలో 12 చోట్ల ఒకేసారి బాంబుల మోత మోగించారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణ హోమంలో 166 మంది అమాయక పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగానే సమయం పట్టింది. పది మంది ఉగ్రవాదుల్లో 9 మంది హతమవ్వగా.. ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ కసబ్ను తర్వాత ఉరి తీశారు. ఈ ఘటనతో ముంబై నగరం భయంతో వణికిపోయింది. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే తన ప్రాణాలను ఫణంగా పెట్టి, వీరోచితగా పోరాడి అమరుడయ్యారు. నాటి ఆ ఉదంతం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఈ ఆపరేషన్లో ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్ కసబ్ను విచారించారు.. తర్వాత అతడికి మరణశిక్ష విధించారు. ఈ ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత 2012 నవంబరులో కసబ్ను ఎరవాడ జైలులో ఉరి తీశారు.
ముంబైలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్థాన్లోనే జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలను భారత్ బయటపెట్టింది. పాక్ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మహ్మాద్ అలీ దురానీ కూడా దీనిని ధ్రువీకరించారు కూడా. కానీ దాయాది మాత్రం తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికీ దబాయిస్తోంది. నాటి ఘటనలో అసువులు బాసిన కుటుంబాలకు, ఉగ్రమూకలతో, వీరోచిత పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వీరులకు ఇదే మన ఘన నివాళి.
More Stories
పరీక్షా కేంద్రాలలో యూపీఎస్సీ ఏఐ ఆధారిత సీసీటీవీ నిఘా
మార్చి 2025 నాటికి అయోధ్య రామాలయం పనులన్నీ పూర్తి
ఛత్తీస్గఢ్ అడవుల్లో నకిలీ నోట్ల ముద్రిస్తున్న నక్సల్స్