ముగ్గురు టీడీపీ నేతలపై మంత్రి రోజా పరువు నష్టం దావా

ముగ్గురు టీడీపీ నేతలపై మంత్రి రోజా పరువు నష్టం దావా
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని విడిచి పెట్టనని చెప్పిన మంత్రి రోజా నగరి కోర్టును ఆశ్రయించారు. ముగ్గురు టీడీపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణతో పాటు నగరి టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భాను ప్రకాశ్, టీవీ రాజేంద్ర ప్రసాద్ లపై మంత్రి రోజా క్రిమినల్ డిఫమేషన్ ఫైల్ చేశారు.
మంగళవారం నగరి కోర్టులో ముగ్గురు టీడీపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. మంత్రి రోజా పిటిషన్ పై విచారణకు కోర్టు స్వీకరించింది. టీడీపీ నేతలు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని రోజా కోర్టుకు తెలిపారు. టీడీపీ నేతలు మాట్లాడిన వీడియోలను ఆమె కోర్టుకు అందించారు.

గతంలో రోజా అశ్లీల చిత్రాలలో నటించారని, ఆ వీడియోలు తన వద్ద ఉన్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యవహారంపై మంత్రి రోజా కోర్టులో పరువు నష్టం దావా వెయ్యటంతో తెరపైకి వచ్చింది.

 మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండారు సత్యనారాయణపై గతంలో గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఆయనపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 504, 354ఏ, 505, 506, 509, 499, ఐటీ సెక్షన్ 67 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్టు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

విపక్ష నేతలపై మాటల యుద్ధం చేస్తుండే మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం సంబరాలు చేసుకోవడంతో టిడిపి నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మంత్రి రోజాపై మండిపడటంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.