కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం.. ముగ్గురు మృతి!

రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం కనకమామిడిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కుప్పకూలింది. ఆ ఘనటలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ టేబుల్ టెన్నిస్ అకాడమి సంస్థకి చెందిన ఇండోర్ స్టేడియంలో కూలీలు నిర్మాణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది.
 
మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

అధునాతన టెక్నాలజీతో ఈ ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టారు. ఒకే పిల్లర్ పై కొత్త టెక్నాలజీతో ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు కాంట్రాక్టర్ ప్రయత్నం చేశాడు. కానీ నిర్మాణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాద సమయంలో దాదాపు 20 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.

స్లాబ్ కూలుతుందని గ్రహించిన కొందరు కార్మికులు బయటకి పరుగులు తీశారు. ఇంకొందరు అప్రమత్తమై బయటకి వచ్చే లోపే ప్రమాదం జరిగింది. దీంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు మాత్రం స్లాబ్ కిందే చిక్కుకుని ప్రాణాలు విడిచారు. కాగా మృతి చెందిన వారి వివరాలు, ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.