22.23 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవ్

22.23 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవ్

తన రికార్డులను తానే అధిగమిస్తూ అయోధ్యలో సరయూ నది తీరంలో దీపావళి సందర్భంగా వరుసగా ఏడవ సంవత్సరం నిర్వహించిన దీపోత్సవంలో 22. 23 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. గతేడాది కంటే 6.47 లక్షల దీపాలను అధికంగా వెలిగించారు. 

అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సరయూ నది తీరంలో నిర్వహిచిన ఈ వేడుకలో భాగంగా ఒకేసారి 22.23 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. ఇది ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ను సొంతం చేసుకుంది. ఈ ఫొటోలను పంచుకున్న ప్రధాని మోదీ దీపోత్సవాన్ని అత్యద్భుతమైన, మరపురాని వేడుకగా అభివర్ణించారు.
కాగా, అయోధ్య గతేడాది 15 లక్షల దీపాలు వెలిగించి నెలకొల్పిన రికార్డును ఈసారి అంతకుమించిన దీపాలతో తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఈ కార్యక్రమంలో 25 వేల మందికిపైగా వలంటీర్లు భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. 

2017లో తొలి ఏడాది 1.17 లక్షల దీపాలు వెలిగించారు. ఆ తర్వాతి నుంచి ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తున్నారు. 2018లో 3.01 లక్ష దీపాలు, 2019లో 4.04 లక్షల దీపాలు, 2020లో 6.06 లక్షల దీపాలు, 2021లో 8.41 లక్షల దీపాలు, 2022లో 15.76 లక్షల దీపాలను వెలిగించారు. 

ఈ ఏడాది దీపోత్సవ్‌లో 54 దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్త్ర మంత్రులు సహితం దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా 21 రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

ఈ ఏడాది దీపోత్సవ కు హనుమాన్ జయంతి కూడా కలసి రావడం, మరోవంక చారిత్రాత్మకమైన రామాలయ నిర్మాణంలో కీలకమైన శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ట మరో 72  రోజులలో ఉండబోవడంతో చాలా ఉత్సాహంగా భక్తులు పాల్గొన్నారు.