తెలంగాణాలో తుది ఓటర్ల జాబితా విడుదల

తెలంగాణాలో తుది ఓటర్ల జాబితా విడుదల
ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న దృష్ట్యా పోలింగ్ సన్నాహాలను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే  నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. నామినేషన్ల పరిశీలన సోమవారం జరిగితే, ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. 
 
ఇటీవలే ఎన్నికల కమిషన్ ఓటర్ల తుది జాబితా విడుదల చేయగా జిల్లాల వారీగా తుది ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్లు విడుదల చేశారు. ఈసీ విడుదల చేసిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,26,18,205 మంది ఉన్నారు. వీరిలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళలు 3,287 మంది ఎక్కువగా ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో మహిళా ఓటర్లదే పైచేయి. 44 నియోజకవర్గాల్లో మాత్రం పురుషులు అధికంగా ఉన్నారు. ఇక జిల్లాల వారీగా చూస్తే 26 జిల్లాలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా 7 జిల్లాలో హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో పురుషులు ఎక్కువగా ఉన్నారు.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 9,99,967 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. అక్టోబరు 4న ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించిన జాబితా ఆధారంగా 18 – 20 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ఏకంగా 8,11,468 మంది ఉండగా అక్టోబర్ 31 తర్వాత ప్రకటించిన జాబితాలో మరో 1,88,019 మంది ఓటర్లు నమోదు అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676 మంది, సర్వీస్ ఓటర్లు 15,406 మంది ఉన్నారు.

• మొత్తం ఓటర్లు – 3,26,18,205

• పురుష ఓటర్లు – 1,62,98,418

• మహిళా ఓటర్లు – 1,63,01,705

• కొత్త ఓటర్లు – 9,99,967

• సర్వీస్ ఓటర్లు – 15,406