బిజెపితో జెడి(ఎస్) పొత్తును వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పార్టీ కర్నాటక శాఖ అధ్యక్షుడు సిఎం ఇబ్రహీంపై జెడి(ఎస్) అధినేత హెచ్డి దేవెగౌడ గురువారం చర్యలు చేపట్టారు. ఆయనను పార్టీ అధ్యక్ష పదవినుంచి తొలగించారు. అలాగే జెడి(ఎస్) రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేశారు. ఇబ్రహీం స్థానంలో తన కుమారుడు కుమారస్వామిని పార్టీ రాష్ట్ర విభాగం తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు.
గురువారం దేవెగౌడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ రాజ్యాంగం ప్రకారం ఇబ్రహీంను తొలగించినట్లు చెప్పారు. కొత్త అధ్యక్షుడిగా కుమారస్వామిని నియమించినట్లు తెలిపారు. కాగా త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయాలని జెడి(ఎస్) నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ నిర్ణయాన్ని ఇబ్రహీం వ్యతిరేకించారు.
ఈ నెల 16న తనతో కలిసి వచ్చే కొందరితో ఆయన సమావేశమయ్యారు. పార్టీపై తిరుగుబాటు చేసిన ఆయన నేతృత్వంలోని పార్టీయే అసలైన జెడి(ఎస్) అని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో బిజెపి, జెడిఎస ల మధ్య పొత్తుకు ఇబ్రహీం అభ్యంతరం తెలిపారు. దీనిపై పార్టీ అధిష్ఠానానికి ఒక మెమోరాండం అందజేయడానికి కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇబ్రహీంను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవినుంచి తొలగించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా రద్దు చేశారు. కాగా బిజెపితో కలిసి పోటీ చేయడానికి తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ సహా అన్ని రాష్ట్ర పార్టీ విభాగాలు తమ ఆమోదం తెలియజేశాయని దేవెగౌడ చెప్పారు. అంతేకాకుండా పార్టీలోని పలువురు ముస్లిం నేతలు కూడా బిజెపితో పొత్తుకు మద్దతు తెలిపినట్లు ఆయన చెప్పారు.
More Stories
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు