
బీజేపీ సీనియర్ నేత, మాజీ రాష్త్ర అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనా రెడ్డిని రాష్ట్రపతి త్రిపుర రాష్ట్ర గవర్నర్గా నియమించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పార్టీలో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న ఆయనను గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడం విశేషం. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అండగా పార్టీపరంగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా (ప్రస్తుతం సూర్యాపేట) తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామానికి చెందిన ఆయన తొలితరం బీజేపీ నేతల్లో ముఖ్యుడిగా ఎదిగారు. 1953 జనవరి 1న జన్మించారు. తొలుత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధి నాయకుడిగా ఎబివిపిలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1972లో గణితశాస్త్రంలో ఎంఎస్సి పూర్తి చేశారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి 1975లో ఎం.ఫీల్ పూర్తి చేశారు.
ఎబివిపి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశారు. నక్సలైట్ వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా పనిచేసి, యూనివర్సిటీ ఆవరణలో కత్తిపోట్లకు కూడా గురయ్యారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ, ఆయన ఏర్పాటు చేసిన చాత్ర సంఘర్ష సమితి తెలంగాణ అధ్యక్షునిగా వ్యవహరించారు.
ఎమర్జెన్సీ సమయంలో మీసా క్రింద అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత 1977లో జనతా పార్టీ ద్వారా రాజకీయ జీవనం ప్రారంభించారు. జనతా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. బీజేపీలో ప్రారంభం నుండి కీలక నేతగా ఎదుగుతూ వచ్చారు. బీజేవైఎం తొలి రాష్త్ర అధ్యక్షునిగా, జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.
మొదటిసారి 1983లో మలక్పేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో అప్పటి హోం మంత్రి ప్రభాకర్ రెడ్డిని ఓడించారు. తర్వాత 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సుమారు 17,791 ఓట్ల మెజారిటీతో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును ఓడించారు.
తిరిగి 1999లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి గెలిచిన ఇంద్రసేనా రెడ్డి పార్టీ శాసనసభ పక్ష నేతగా వ్యవహరించారు. 2003 ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులై 2006 వరకు కొనసాగారు. 2007లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ జాతీయ కార్యవర్గంలో కొనసాగుతున్నారు.
తెలంగాణపై ప్రకటన ఇప్పించిన ఘనత ఆయనదే
తెలంగాణకు అనుకూలంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకోవడంలో ఇంద్రసేనా రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2005లో అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని తొలిసారిగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెనుక అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇంద్రసేనా రెడ్డిదే ప్రధాన భూమిక వహించారు.
ముక్కుసూటి మనిషిగా, వివిధ కీలక అంశాలపై నిక్కచ్చిగా వ్యవహరించే నేతగా గుర్తింపు ఉన్న ఆయన పార్టీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో తన వంతు పాత్ర పోషించారని వివరించాయి. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిగా ముద్రవేసుకున్నారు. . కాగా, ఇప్పటికే తెలంగాణకు చెంది న బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్గా ఉన్నారు.
ఒడిసా గవర్నర్గా రఘుబర్ దాస్
ఒడిశా గవర్నర్గా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దా స్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు సీఎంగా పనిచేశారు. ఇంద్రసేనా రెడ్డి, దాస్ నియమకాలపై రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు