ఎదురెళ్లి 250 మంది హమాస్ బందీలను విడిపించిన సైన్యం

ఎదురెళ్లి 250 మంది హమాస్ బందీలను విడిపించిన సైన్యం
ఇజ్రాయెల్‌, హ‌మాస్ ఉగ్రమూక‌ల మ‌ధ్య భీక‌ర పోరు కొన‌సాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌ సైన్యం డేరింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. శనివారం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్‌ 250 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే.  వారిని గాజా సరిహద్దుల్లో బంధించినట్లు తెలుసుకున్న ఐడీఎఫ్ ఆ ప్రాంతంలో డేరింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది.
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మిలిటెంట్లకు ఎదురెళ్లి వారి చెరలో ఉన్న వారందరినీ సురక్షితంగా విడిపించింది. ఈ దాడిలో సుమారు 60 మంది ఉగ్రవాదులను ఐడీఎఫ్‌ మట్టుపెట్టింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.
‘శనివారం ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. గాజా సరిహద్దుల్లో వారిని బం ధించిందనే సమాచారంతో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడిఎఫ్)హమాస్ మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసి బందీలను సురక్షితంగా విడిపించాయి.ఈ దాడుల్లో 60 మంది మిలిటెంట్లను ఐడిఎఫ్ మట్టుబెట్టింది. హమాస్ దక్షిణ నేవీ కమాండర్ డిప్యూటీ కమాండర్ ముహమ్మద్ అబూ ఆలీ సహా 26 మంది మిలిటెంట్లను మా దళాలు అదుపులోకి తీసుకున్నాయి’ అని  ఐడిఎఫ్ ఓ  ట్వీట్‌లో తెలిపింది.
ఐడిఎఫ్ దళాలు ఉగ్రవాదులు నక్కి ఉన్నగదుల్లోకి తూటాల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అనంత రం వారిని బైటికి రప్పించడానికి గ్రనేడ్‌తో దాడి చేసి బం ధించాయి. దాడిలో పాల్గొన్న ఓ ఇజ్యాల్ సైనికుడి బాడీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి.
రాకెట్ల‌తో హ‌మాస్ దాడి చేసిన నేపథ్యంలో  గాజా స్ట్రిప్‌పై గ‌త శ‌నివారం నుంచి జ‌రుగుతున్న దాడుల్లో సుమారు ఆరు వేల బాంబుల‌ను వాడిన‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం గాజాపైనే ఆరు వేల బాంబులు వేసిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఆ బాంబులు దాదాపు 4వేల ట‌న్నులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  గాజాలో ఉన్న హ‌మాస్ ప్రాంతాల‌పై బాంబుల‌తో ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. త‌మ వైమానిక ద‌ళం సుమారు 3600 టార్గెట్ల‌ను అటాక్ చేసిన‌ట్లు ఇజ్రాయిల్ వైమానిక ద‌ళం పేర్కొన్న‌ది.
కాగా, హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపును సమూలంగా మట్టుపెట్టే ప్లాన్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ ‘గ్రౌండ్‌ ఆపరేషన్‌’ ప్రారంభించినట్టు తెలుస్తున్నది. గాజా భూభాగంలోకి తమ బలగాలు, యుద్ధ ట్యాంకులు ప్రవేశించినట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌(ఐడీఎఫ్‌) శుక్రవారం ప్రకటించింది.  ఉగ్రవాదులను మట్టుపెట్టడంతోపాటు ఇజ్రాయెల్‌ నుంచి బందీలుగా తీసుకెళ్లిన వారి ఆచూకీ కోసం గత 24 గంటలుగా ‘స్థానిక ఆపరేషన్‌’ ప్రారంభించినట్టు తెలిపింది.
పలు టెర్రరిస్టులను తమ బలగాలు విజయవంతంగా హతమార్చాయని, బందీల ఆచూకీకి సంబంధించి సమాచారం సేకరించాయని పేర్కొన్నది. అయితే ఇజ్రాయెల్‌ బలగాలు గాజా భూభాగం పూర్తి లోపలికి ఇంకా వెళ్లలేదని ‘చానెల్‌ 12’ నివేదించింది. అయితే, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ దాడులు వెంటనే ఆపకుంటే, ఈ యుద్ధం మధ్య ప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని ఇరాన్‌ హెచ్చరించింది.