గంగాజలంపై జిఎస్‌టి లేదు

గంగాజలంపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం పన్ను విధించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో గురువారం ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నులు, క‌స్ట‌మ్స్ బోర్డు (సీబీఐసీ) ఎలాంటి జిఎస్‌టి విధించలేదని వివరించింది. దేశం మొత్తం మీద చాలా కుటుంబాలు తమ ఇళ్లల్లో పూజ కోసం వినియోగించే గంగాజలం, పూజాసామగ్రిపై ఎలాంటి జిఎస్‌టి విధించడం లేదని సిబిఐసి పేర్కొంది.

జిఎస్‌టి అమలు అవుతున్న నాటి నుంచి జిఎస్‌టిని వాటిపై మినహాయించినట్టు పేర్కొంది. 2017 మే 1819 తేదీల్లో జిఎస్‌టి కౌన్సిల్ 14,15 వ సమావేశాల్లో పూజా సామగ్రిపై జిఎస్‌టి విధించడంపై చర్చ జరిగిందని , ఈ క్రమంలో జిఎస్‌టిని మినహాయింపు జాబితాలో వీటిని చేర్చాలని నిర్ణయమైందని వివరించింది.

గురువారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గంగాజలంపై ప్రభుత్వం 18 శాతం జిఎస్‌టి విధించిందని, ఇది నిలువుదోపిడీ, వంచనగా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఇచ్చిన ట్వీట్ సందర్భంగా ఈ వివరణ ఇచ్చింది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి హిందీలో పోస్ట్ చేశారు. “ మీరు ఉత్తరాఖండ్‌లో ఈరోజు పర్యటిస్తుండటం మంచిదే. కానీ మీ ప్రభుత్వం మాత్రం పవిత్ర గంగా జలంపై జిఎస్‌టి 18 శాతం విధించింది. గంగాజలం ఇళ్లల్లో ఉంచుకోవడానికి ఆర్డరు ఇచ్చిన వారిపై ఇదెంతభారమో మీరు ఆలోచించాలి ” అని ఖర్గే పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.