తెలంగాణాలో ఎన్నికల నియమావళిని పకడ్భందీగా అమలు చేసే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం పలువురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను, ఉన్నతాధికారులపై కొరడా ఝళిపించింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి. నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, ముగ్గురు పోలీసు కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, వరంగల్ సిపి రంగనాథ్, నిజామాబాద్ సిపి వి.సత్యనారాయణ, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టికె శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీతో పాటు తొమ్మిది జిల్లాల నాన్ కేడర్ ఎస్పీల బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. వీరి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ఒకొక్క పోస్టుకు ముగ్గురి పేర్లు చొప్పున గురువారం సాయంత్రం 5 గంటల కల్లా ప్యానల్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇసి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పలువురు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది. పోలీసు శాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఇసి అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్పి స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు.
ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించాయి. రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అదేవిధంగా తెలంగాణలో జరిగిన సమీక్షా సమావేశంలో అనేక మంది నాన్-క్యాడర్ అధికారులను జిల్లా ఇన్ఛార్జ్లుగా నియమించారని, పరిపాలనా, పోలీసు సేవలకు చెందిన అధికారులకు తక్కువ ప్రాధాన్యతగల పోస్టింగ్లు ఇచ్చారని ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు వచ్చిన వారిపై ఇసి బదిలీ వేటు వేసింది.
ఎన్నికల జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మొత్తం మీద బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. 4 కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు పనిలో అలసత్వం చూపుతున్నారని వారిని బదిలీ చేసింది. బదిలీ అయిన వారంతా తక్షణమే జూనియర్లకు ఛార్జ్ను అప్పగించాలని ఆదేశించింది.
More Stories
అల్లర్ల నిందితుల అరెస్ట్కు ప్రత్యేక బృందాలు
మైనారిటీలకు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు
ఇరాన్ అధ్యక్షుడు హత్యకు గురయ్యారా?