బీజేపీ ప్రభుత్వం రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు

బీజేపీ ప్రభుత్వం రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  
 
బుధవారం ఆయన మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ దేవతలు వెలిసిన ములుగు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.900 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం ప్రకటించడం పట్ల సంతోషం ప్రకటిస్తూ అందుకు ప్రధాని మోదీకి తాను హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. జాతి నిర్మాణంలో ఆదివాసీల త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లతో ట్రైబల్ మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. 

అలాగే రూ.6.5 కోట్లతో నిర్మించిన గిరిజన పరిశోధనా కేంద్రాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలోని రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా ప్రధాని ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు.

తెలంగాణలో రూ.420 కోట్లతో 17 కొత్త ‘ఏకలవ్య’ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలను ఆకాంక్ష జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కేంద్ర ప్రభుత్వంరూ.37 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. 

స్వదేశ్ దర్శన్ కింద రూ.80 కోట్లతో ములుగు-లక్నవరం-తాడ్వాయి-దామరవాయి-బొగత జలపాతాల సర్క్యూట్‌ను అభివృద్ధి చేసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సోమశిల, సింగోటం, కదలివనం, అక్కమహాదేవి, ఈగలపెంట, ఫరహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం ఎకో సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు మరో రూ.92 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు.