అంతరిక్ష పరిశోధల్లో ఇస్రో దూసుకుపోతోంది. ముఖ్యంగా, చంద్రయాన్ 3 ఘన విజయం అనంతరం వరుస ప్రయోగాలకు రంగం సిద్ధం చేస్తోంది. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన తర్వాత, ఇస్రో గగన్యాన్, శుక్రయాన్లతో సహా పలు అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. సూర్యుడిపై ప్రయోగాలకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్-1 కూడా విజయవంతం కావడంతో, రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తు ప్రాజెక్టులపై ఇస్రో దృష్టి పెడుతోంది.
ఇప్పుడు, ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరీక్షలను ఇస్రో చేపట్టనుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సన్నాహాకాలు చేపట్టారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి అంతరిక్షంలోకి మానవుల్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్యాన్ అంతరిక్ష నౌక ఫొటోలను శనివారం విడుదల చేసింది. ఈ మిషన్కు సంబంధించి మానవరహిత ఫ్లైట్ టెస్టులను ప్రారంభించనున్నట్టు తెలిపింది.
భవిష్యత్తులో భారత్ తరఫున ఇస్రో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ను నిర్మించబోతోందని తెలిపారు. చంద్రయాన్ 3 తరువాత ఇస్రో గగన్యాన్ను అత్యంత ప్రధాన అంశంగా ఎంచుకుంది. స్పేస్లోకి మానవ రహిత ఫ్లైట్ టెస్టులను వరుసగా ఆరంభించనున్నట్లు ఈ ప్రాజెక్టు అప్డేట్లో ఇస్రో వివరించింది. క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును ప్రదర్శించే తొలి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబోర్ట్ మిషన్-1 (టీవీ-డీ1)ను పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్టు ఇస్రో వివరించింది.
అత్యవసర పరిస్థితుల్లో రాకెట్ నుంచి వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుందని పేర్కొంది. టివిడి1 పరీక్షలు గగన్యాన్కు అత్యంత కీలకం. క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏ విధంగా సమర్ధవంతంగా పనిచేస్తుంది? తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటీ అనేది ఈ క్రమంలో నిర్థారించుకుంటారు.
అత్యవసర పరిస్థితుల్లో టివి డి1 వెహికల్ నుంచి వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్ను సురక్షిత ప్రాంతానికి చేర్చేందుకు ఈ టెస్టుల ప్రక్రియ అవసరం. ఈ నెల చివరి నుంచి టివి డి1 పరీక్షలు చేపడుతారని ఇంతకు ముందు అధికారులు తెలిపారు. టెస్ట్ వెహికల్ సింగిల్ స్టేజీ లిక్విడ్ రాకెట్గా రూపొందుతుంది.
ఇందులో రెండు పేలోడ్స్ ఉంటాయి. క్రూ మాడ్యూల్ (సిఎం), క్రూ ఎస్కేప్ సిస్టమ్స్ (ఇఇఎస్) వ్యవస్థలు అత్యంత చురుగ్గా పనిచేసే సమర్థవంతమైన మోటార్లతో ఉంటాయి. దీనితో పాటు సిఎంఎఫ్, ఇంటర్ఫేస్ అడాప్టర్స్ కూడా ఇమిడి ఉంటాయి. టివి డి1 ప్రయోగంలో వినియోగించే పీడన రహిత క్రూ మాడ్యూల్ చిత్రాలను ఇప్పటికే ఇస్రో విడుదల చేసింది.
గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురిని తొలుత ఎంచుకుని భూమికి 400 కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి తీసుకువెళ్లుతారు. రెండు మూడు రోజులు వారికి అంతరిక్షంలోనే ఉండేలా చేసి తిరిగి తీసుకువస్తారు. ముందుగా వారిని అంతరిక్ష ప్రయోగాల వేదిక అయిన శ్రీహరికోటకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో బంగళాఖాతంలో దిగేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రధాన రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్ను భారతీయ నౌకాదళం రికవరీ చేసుకుంటుంది.
More Stories
బీజేపీకి 400 సీట్లు వస్తే మధుర, కాశీలోనూ దేవాలయాలు నిర్మిస్తాం
వడ్డీ రేట్లను భారీగా పెంచిన స్టేట్ బ్యాంకు
చాబహార్ పోర్టుపై చిన్న చూపు తగదు .. అమెరికాకు హితవు