ఆఫ్ఘన్ భూకంపంలో రెండు వేలు దాటిన మృతులు

ఆఫ్ఘన్ భూకంపంలో రెండు వేలు దాటిన మృతులు
 
అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. శనివారం సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈ విపత్తులో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వీడియాకు వెల్లడించారు.
 
భూప్రకంపనల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు తెలియజేస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో వరుసగా ఏడు సార్లు ప్రకంపనలు రాగా వీటిలో అయిదు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. 
 
ఈ ప్రమాదంలో ఎన్నో భవనాలు నెలమట్టం అయ్యాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భూకంప కేంద్రమైన హెరాత్‌ జిల్లాలో నాలుగు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయిహెరాత్‌ ప్రావిన్స్‌కు వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 
 
భూకంపం వచ్చిన వెంటనే ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాలు, ఆఫీస్‌లలోని ప్రజలు భయంతో బయటికి పరిగెత్తారు.  రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో సంభవించిన ప్రధాన భూకంపం తర్వాత 5.5, 4.7, 6.3, 5.9, 4.6 తీవ్రతతో 5 భూకంపాలు వచ్చినట్లు తెలిపారు. అరగంట వ్యవధిలోనే 3 భూకంపాలు సంభవించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ వాసులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. 
 
ఇక వరుస భూకంపాలు సంభవించిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. పట్టణ ప్రాంతాల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది. గాయపడిన వేలాది మంది వివిధ నగరాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు. 
 
మొత్తం ఐదు సార్లు భూమి కంపించినట్లు వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాలకు 5.6 తీవ్రతతో మొదటిసారి భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత మరో అరగంట వ్యవధిలోనే మరో 2 సార్లు భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 12 గంటల 11 నిమిషాలకు 6.1 తీవ్రతతో ఒకసారి, ఆ తర్వాత 12 గంటల 42 నిమిషాలకు 6.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు తెలిపింది. 
 
ఇక ఈ భూకంపంలో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన 11 మంది కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుని సమాధి అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.  హెరాత్ ప్రావిన్స్‌లో 19 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ హెరాత్ ప్రావిన్స్‌లో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 
 
ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణిలో ఇది యురేషియన్, భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంది. గతేడాది జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతో సంభవించిన భయంకరమైన భూకంపంలో దాదాపు వెయ్యి మంది చనిపోగా.. దాదాపు 10 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఈ ఏడాది మార్చిలో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 13 మంది చనిపోయారు.