ఈ ఏడాది రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా అమెరికా వీసాలు

ఈ ఏడాది రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా అమెరికా వీసాలు
భారత్ నుంచి చాలా మంది ప్రజలు చదువులు, ఉద్యోగాలు, బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇక అత్యధికంగా వెళ్లేది మాత్రం అందులో అమెరికాకే. అమెరికాలో కూడా ఎక్కువగా ఉండే విదేశీయుల్లో భారతీయులే ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలోనే భారత్ నుంచి ఏటా అమెరికాకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమెరికాకు వెళ్లే భారతీయులకు 10 లక్షల వీసాలు జారీ చేసినట్లు అమెరికా ఎంబసీ వెల్లడించింది. ఈ 2023 ఏడాదిలో ఇప్పటివరకు అన్ని రకాల వీసాలు కలిపి 10 లక్షల వీసాలు జారీ చేసినట్లు వెల్లడించింది. 
 
ఇప్పటికే తమ లక్ష్యాన్ని చేరుకున్నామని, అయితే ఇంతటితో ఆగకుండా మరింత మంది భారతీయులకు వీసా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది.  గత సంవత్సరం 1.2 మిలియన్ల లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారని ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రయాణ సంబంధాలలో ఒకటిగా నిలుస్తుందని ఈ ప్రకటన పేర్కొంది.
 
“మిషన్ 1 మిలియన్ పూర్తయింది. భారత్‌లో ఈ ఏడాది వీసాల జారీ కోసం ‘మిలియన్‌ వీసాల జారీ’ టార్గెట్‌ను దాటేశాం. అయితే ఇంతటితో మేము ఆగిపోము. రాబోయే నెలల్లో మరిన్ని వీసాలు జారీ చేస్తాం. మరింత మంది భారతీయులు అమెరికాలో పర్యటించేందుకు అవకాశం కల్పిస్తాం’’ అని అమెరికా ఎంబసీ తమ ట్విటర్‌లో పేర్కొంది.


ట్వీట్‌తో పాటు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి మాట్లాడుతూ ఉన్న ఒక వీడియోను విడుదల చేసింది. భారతీయులకు 10 లక్షల అమెరికా వీసాలు జారీ కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాకు కావాల్సిన ముఖ్యమైన దేశాల్లో భారత్‌ కూడా ఒకటని పేర్కొన్నారు.

అమెరికా, భారత్‌ల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమైందని, అది ప్రత్యక్షంగా చూసేందుకు రానున్న రోజుల్లో మరింత మంది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు అందిస్తామని ఎరిక్ గార్సెట్టి తెలిపారు. అయితే 2022 ఏడాది జారీ చేసిన మొత్తం వీసాలను ఈ ఏడాది 9 నెలల్లోనే జారీ చేసినట్లు అమెరికా ఎంబసీ వెల్లడించింది.

2019 తో పోలిస్తే ఇది 20 శాతం అధికమని తెలిపింది. ఇక ప్రపంచ దేశాలు అన్నింటికీ అమెరికా జారీ చేసిన వీసాల్లో 10 శాతం భారతీయులకే దక్కాయని, ఇందులో స్టూడెంట్ వీసాలు 20 శాతం, హెచ్‌, ఎల్ కేటగిరీ ఉద్యోగ వీసాల్లో 65 శాతం భారతీయులకే జారీ అయ్యాయని వెల్లడించింది.