జ‌మిలీ వైపే లా క‌మిష‌న్‌ మొగ్గు

ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా జమిలీ ఎన్నికల అంశాన్ని తరచూ లేవనెత్తుతున్నారు. లోక్‌స‌భతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని బలమైన వాదనను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతంఈ ప్రతిపాదన అమలు చేయడానికి రోడ్డు మ్యాప్ తయారు చేయాలని న్యాయ కమిషన్ ను కోరగా,  లా కమిషన్ సైతం జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపునట్లు సమాచారం. 
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీ ఎత్తున ప్రజాధనం, సమయం ఆదా అవుతాయని, పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని భావిస్తోంది. ఢిల్లీలో జరిగిన లా కమిషన్ భేటీలో జమిలి తో పాటు అప్పగించిన మరో రెండు అంశాల పైన తుది నివేదికను ఖరారు చేయనున్నట్లు తెలుస్తున్నది.  జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్న కేంద్రం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
ఇప్పటికే ఈ కమిటీ ఒకసారి భేటీ అయింది. తదుపరి భేటీలో రాజకీయ పార్టీలు, లా కమిషన్‌ను తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఆహ్వానించింది.  ఈ నేపథ్యంలో లా కమిషన్ జమిలి ఎన్నికలపై ఇవ్వబోతున్న నివేదిక కీలకంగా మారింది. ఈ నివేదికలో లా కమిషన్ పలు కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. 2024, 2029 లో జమిలీ తరహాలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి నివేదించినట్లు సమాచారం. 

అటు దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎలా నిర్వహించాలో అన్నదానిపై, షెడ్యూల్ పై కీలక సలహాలు, సూచనలుఇవ్వనున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత కేంద్ర న్యాయ శాఖకు ఈ రిపోర్టు పంపనున్నట్లు సమాచారం. 2018లో జస్టిస్ బిఎస్ చౌహన్ నేతృత్వంలోని 21వ లా కమిషన్ ముసాయిదా నివేదికలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు ఆలోచనకు బీజం పడింది. 

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం జమిలీ పై సీరియస్ గా ఆలోచిస్తున్న వేళ ఈరోజు తాజాగా లా కమిషన్ చైర్మన్ రీతూరాజ్ అవస్తి నేతృత్వంలో కీలక భేటీలో దేశానికి జమిలీ ఎన్నికల శ్రేయస్కరమని ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల అభిప్రాయాలు సైతం కీలకం కానున్నాయి. అంతకంటే ముందే తీసుకోవలసిన, పరిగణించాల్సిన అంశాలు సానుకూలంగా ఉండడం గమనార్హం.