భారత్ నుంచి ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం ‘2018′

భారత్ నుంచి ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం ‘2018′

‘ఆస్కార్‌ 2024’ అవార్డుల కోసం భారత్ నుంచి మలయాళం చిత్రం ‘2018’ అధికారికంగా ఎంపికయింది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్‌ అవార్డుల కోసం బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘2018’ చిత్రాన్ని ఎంపిక చేశారు. ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ, ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం 22 చిత్రాలను కమిటీ వీక్షించిన అనంతరం.. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరి కోసం ‘2018’ సినిమాను ఎంపిక చేసింది.

ఆస్కార్‌ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్‌ కోసం పంపిన మొత్తం 22 చిత్రాలను వీక్షించింది. చెన్నైలోని సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో జ్యూరీ సభ్యులు బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. పర్యావరణ మార్పులు, సమాజ అభివృద్ధిపై అవగాహన కల్పించే విధంగా రూపొందించడంతో ఈ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు. 
 
2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టోవినో థామస్‌ ప్రధాన పాత్ర పోషించారు.  జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల గొప్ప భావోద్వేగాన్ని కలిగించింది. వ‌ర‌ద‌ల్లో మ‌న‌మే చిక్కుకుపోయామా అనుకునేంత గొప్పగా ద‌ర్శకుడు ఈ చిత్రంలోని స‌న్నివేశాల్ని మ‌లిచాడు. 
 
ఆద్యంతం భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దిన ఈ చిత్రం  మలయాళంతో పాటు, ఇతర భాషల్లోనూ విజయం సాధించింది. ‘ఎవ్రీవ‌న్ ఈజ్ ఎ హీరో’ అనేది ఈ సినిమాకి ఉప‌శీర్షిక‌. ఆ ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకుడి మనసులో ముద్ర వేసుకుంది.  అటు కమర్షియల్ గానూ ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అత్యున్నత సాంకేతిక నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్ కి పోటీ పడుతుంది.