30 నుంచి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో “శౌర్య జాగరణ యాత్ర”

30 నుంచి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో “శౌర్య జాగరణ యాత్ర”

దేశంలోని యావత్ యువతను మేల్కొల్పేందుకు విశ్వహిందూ పరిషత్ – భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో  శౌర్య జాగరణ యాత్ర చేపడుతున్నామని  పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి జిల్లాలో యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

ఈనెల 30వ తేదీ నుంచి వచ్చే నెల (అక్టోబర్ )14 వరకు శౌర్య జాగరణ యాత్ర నిర్వహిస్తామని చెబుతూ శౌర్య జాగరణ యాత్ర గోడపత్రికలు, కరపత్రాలు, స్టిక్కర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతీయ యువతను మేల్కొల్పి దేశ చరిత్ర, భద్రత విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. 

నేడు సమాజంలో భారతీయతపై, హిందుత్వంపై అరాచకవాదులు దాడులకు తెగబడుతున్నారని చెబుతూ సనాతన ధర్మాన్ని పెకిలించి వేస్తామని వెకిలి మాటలు మాట్లాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అరాచక, ఉగ్రముఖలకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు.

భారతీయం కోసం, సనాతన ధర్మం కోసం పోరాడిన పరాక్రమ వీరుల చరిత్రను నేటి సమాజానికి తెలియజేసి, జాగృతం చేస్తామని వారు . చెప్పారు. వక్రీకరించిన చరిత్ర కాకుండా, వాస్తవ చరిత్రను నేటి సమాజం తెలుసుకోవాలని పేర్కొంటూ ఆ విషయంలో అందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు. మన పుణ్యభూమి.. వేద భూమి.. కర్మభూమి అయినా భరత భూమి గొప్ప చరిత్ర కలిగి ఉందని చెబుతూ మహా పురుషులు, స్వాతంత్ర సమరయోధులు, వీర వనితలు, వీరమాతల ధైర్య శౌర్య పరాక్రమాలు నేటి సమాజానికి తెలియాల్సిన అవసరం చాలా ఉందని వారు స్పష్టం చేశారు.

ఈ దేశ పౌరులందరూ సమానమే అయినప్పుడు, సమన్యాయం కోసం పోరాడాలనే విషయాలు అవగాహన పరుస్తామని తెలిపారు. మెజారిటీ- మైనారిటీ అంటూ ఒకే దేశంలోని ప్రజలు రెండు రకాలుగా రెండు న్యాయవ్యవస్థలను, రెండు చట్టాలను కలిగి ఉండటం  అసహజం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  దేశ ప్రజలందరూ ఒకటే అనే భావన తీసుకొచ్చేందుకు ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చే విషయంలో మద్దతుగా ఉండటంతో పాటు వర్గాల వారిగా, మతాలవారీగా పనిగట్టుకొని జనాభాను పెంచుతున్న వారిని అదుపు చేసి జనాభా సమతుల్యం పాటించడం అత్యవసరం అని వారు పిలుపిచ్చారు. 

 జిహాదీల ముసుగులో చేస్తున్న అరాచకాలు, ఆడపిల్లల అవహరణ (లవ్ జిహాద్), మతమార్పిడుల, దేవాలయల భూకబ్జాలు, గోహత్యలు.. తదితర విషయాలపై అవగాహన పరచడంతో పాటు యువతను చైతన్యం చేస్తామని నాయకులు వివరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు  జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్  పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు కూడా పాల్గొన్నారు.