కాంగ్రెస్ ఎంపీపై అస్సాం సీఎం భార్య రూ.10 కోట్ల ప‌రువున‌ష్టం దావా

కాంగ్రెస్ ఎంపీపై అస్సాం సీఎం భార్య రూ.10 కోట్ల ప‌రువున‌ష్టం దావా
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ భార్య రినికి భుయాన్ శ‌ర్మ‌ కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్‌పై ప‌రువున‌ష్టం కేసు దాఖ‌లు చేశారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన గ‌గోయ్‌ రూ. 10 కోట్లు చెల్లించాలంటూ ఆ కేసులో ఆమె డిమాండ్ చేశారు.  ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు రినికిపై కాంగ్రెస్ నేత ఆరోప‌ణ‌లు చేశారు.
అస్సాం సీఎం భార్య త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది దేవ‌జిత్ సైకియా వాదిస్తున్నారు. కామ‌రూప్ మెట్రోపాలిట‌న్ సివిల్ కోర్టులో కేసు వేశారు. సెప్టెంబ‌ర్ 26వ తేదీన కేసును విచారించ‌నున్నారు.  కేంద్ర ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు ఎటువంటి స‌బ్సిడీ అంద‌లేద‌ని సైకియా త‌న దావాలో తెలిపారు. అస‌లు స‌బ్సిడీ ఇచ్చేందుకు చేప‌ట్టాల్సిన ప్ర‌క్రియే జ‌ర‌గ‌లేద‌ని ఆమె స్పష్టం చేశారు. 
పీఎం కిసాన్‌ సంపద యోజన పథకం ద్వారా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్‌ శర్మకు చెందిన కంపెనీకి రూ.10 కోట్లు అందిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  కేంద్ర ఆహార శాఖ వెబ్‌సైట్‌లోనే దీనికి సంబంధించిన సమాచారం ఉంది. సంపద యోజన పథకం కింద సబ్సిడీతో కూడిన రుణం రూ.10 కోట్లు రినికి భూయాన్‌ శర్మకు చెందిన ‘ప్రైడ్‌ ఈస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి’ కంపెనీ అందుకున్నట్టు ఆ వెబ్‌సైట్‌ పేర్కొన్నది.
ఈ వ్యవహారం అస్సాంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. నాగోన్‌ జిల్లా డారిగాజి గ్రామంలో 30 ఎకరాల వ్యవసాయ భూమిని పారిశ్రామిక భూమిగా అధికారులు వర్గీకరించారు. ఇది జరిగిన నెల రోజుల్లోనే సీఎం హిమంత బిశ్వ శర్మ కుటుంబ సభ్యులు ఆ భూమిని కొనుగోలు చేయటం సంచలనం రేపింది. 

ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలంటూ గౌహ‌తి హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. అయితే ఈ ఆరోపణల్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండిస్తున్నారు. పీఎం కిసాన్‌ సంపద యోజన ద్వారా తన భార్యకు, ఆమెకు చెందిన కంపెనీకి ఎలాంటి నిధులు మంజూరు కాలేదని వివరణ ఇచ్చారు.