పీవోకేలోని ఉగ్రవాదులకు చైనీస్ ఆయుధాలు

పీవోకేలోని ఉగ్రవాదులకు చైనీస్ ఆయుధాలు
భారత్‌కు వ్యతిరేకంగా సరిహద్దుల్లో నిత్యం పాకిస్థాన్, చైనా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించడం, వారికి అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయడం వాటి ద్వారా భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం. ఈ రెండు దేశాలు రహస్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు సహకారం అందించి వారిని భారత్‌లోకి చొరబడేలా పురిగొల్పుతున్నాయి. 
 
ఈ క్రమంలోనే తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనా నుంచి సరఫరా అయిన అత్యాధునిక ఆయుధాలను పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాకిస్థాన్ అందిస్తోంది. దీని గురించి ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందడం తాజాగా కలకలం రేపుతోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాద గ్రూపులకు చైనా నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. 
 
ఈ అత్యాధునిక చైనీస్ ఆయుధాలను పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ వాటిని ఉగ్రవాదులకు అందిస్తోందని తెలిసింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో భారత సైన్యం ఉగ్రమూకల చర్యలను పసిగట్టేందుకు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారంతో నేషనల్ మీడియాల్లో వార్తలు బయటికి వచ్చాయి.
 
చైనాలో తయారైన అత్యాధునిక వెపన్స్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పిస్తోళ్లు, గ్రనేడ్లు, రాత్రిపూట స్పష్టంగా చూసేందుకు వీలుగా నైట్‌ విజన్‌ డివైజ్‌లతోపాటు చాలా అడ్వాన్స్‌డ్ వెపన్స్ పీఓకేలోని ఉగ్రవాదులకు అందుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. 
 
ఈ ఆయుధాలను పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి పంపించేందుకు చైనా తయారీ డ్రోన్లను వినియోగిస్తున్నట్లు కూడా గుర్తించాయి. వీటితో పాటు భారత్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశించేందుకు అత్యాధునిక డిజిటల్‌ మ్యాప్‌లు, నావిగేషన్‌ సిస్టమ్స్‌ను కూడా చైనా నుంచి పాకిస్థాన్‌కు అక్కడి నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు సమాచారం.

మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదులు ఇతరులతో మాట్లాడేందుకు ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు దొరకకుండా ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ డివైజ్‌లు కూడా ఉగ్రవాదులకు అందనట్లు సమాచారం. దీంతో ఈ వివరాలను దర్యాప్తు సంస్థలు, సైన్యానికి అందించిన ఇంటెలిజెన్స్ వర్గాలు  తదుపరి చర్యలు తీసుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. 

 
ఈ క్రమంలోనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ  (ఎన్ఐఏ) గురువారం ఒక ఐసిస్ ఉగ్రవాదిని పట్టుకుంది. కెన్యాలోని నైరోబీ నుంచి విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన అరాఫత్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. దేశంలో ఐసిస్ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి కీలక విషయాలను పసిగట్టడంలో కీలక ముందడుగు పడిందని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. 2020 నుంచి అరాఫత్ అలీ పరారీలో ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.