చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ 19కి వాయిదా

చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ 19కి వాయిదా
ఏపీ హైకోర్టులో టిడిపి అధినేత చదన్రాబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందన్న హైకోర్టు వచ్చే మంగళవారానికి(సెప్టెంబర్ 19) వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. 
 
గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జడ్జి కోరారు. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని న్యాయమూర్తి చెప్పగా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా తెలిపారు. విచారణను వాయిదా వేసిన నేపథ్యంలో ఈనెల 18 వరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
 
సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణను ఈనెల 18 వరకు చేపట్టవద్దని తెలిపింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ విచారణ కూడా ఈ నెల 19కి వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం. స్కిల్ స్కాం కేసు, ఎసిబి కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
 
ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఆయన తరపున వాదిస్తున్నన్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టును కోరారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు. చంద్రబాబుపై విచారణ ప్రాథమిక దశలో ఉందని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు కోర్టును కోరారు.
 
 ఈ క్రమంలో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరువైపుల వాదనలను పూర్తిగా వినాల్సి ఉందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పొన్నవోలు కోరారు. దీంతో, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నామని, ఆలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది.
 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన చంద్రబాబు రాజకీయ కక్షతోనే తన పేరు ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నిందితుడిగా ఉండటంతో 5రోజుల కస్టడీ కోరుతూ సిఐడి ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఏసీబీ కోర్టు అనుమతిస్తుందనే అనుమానంతో అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తరపున దాఖలైన హౌస్ రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీకోర్టు తిరస్కరించింది. ఇంటి కంటే జైలు పదిలం అన్న సీఐడీ వాదనలతో కూడా ఏకీభవించింది. ఈ నేపథ్యంలో హౌస్ రిమాండ్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఐపిసి 409 ప్రకారం కేసులు నమోదు కావడంతో ఇప్పట్లో బెయిల్ లభించడం కష్టమేనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు వరుస కేసులతో చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేయడానికి సిఐడి, సిట్ సిద్ధం అవుతోంది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఇప్పటికే 14రోజుల రిమాండ్ విధించడంతో దానిపై బెయిల్‌ వచ్చినా ఇతర కేసుల్లో రిమాండ్‌ కొనసాగిస్తారని అనుమానిస్తున్నారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ నిర్ణయం వ్యవహారంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.