భారత రెజ్లింగ్‌ సమాఖ్య సభ్యత్వాన్ని రద్దుచేసిన యూడబ్ల్యూడబ్ల్యూ

భారత రెజ్లింగ్‌ సమాఖ్య సభ్యత్వాన్ని రద్దుచేసిన యూడబ్ల్యూడబ్ల్యూ
భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సభ్యత్వాన్ని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ రద్దు చేసింది. ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ  వెల్లడించింది. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు ‘డబ్ల్యూఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూఎఫ్‌ఐ అడహాక్‌ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం ఇచ్చింది’ అని భారత ఒలిపింక్‌ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. 

కాగా, ఈ నిర్ణయంతో ఇండియన్ రెజ్లర్లు రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున పాల్గొనే వీలుండదు. సెప్టెంబరు 16 నుంచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీ జరగనుంది. అయితే ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పోటీ పడే అవకాశం లేకపోవడంతో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీ పడాల్సి ఉంటుంది. భారత్​ ట్యాగ్​లైన్ ​ లేకుండానే వారు ఆడాల్సి వస్తుంది.

ఇటీవలే మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ షరణ్‌ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో డబ్ల్యూఎఫ్‌ఐ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శరణ్‌ సింగ్‌ను పదవి నుంచి తప్పించాలని మహిళా రెజ్లర్లు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రద్దు చేసింది. 

ఆ తర్వాత  డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాల నిర్వహణను అడ్‌హక్‌ కమిటీకి అప్పగించింది. ఆగస్టు 27న ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి 45 రోజుల్లోగా  డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌కు ఎన్నికలు నిర్వహించాలి. గడువులోగా ఎన్నికలు పూర్తి చేయాలని, లేదంటే సస్పెన్షన్‌ వేటు తప్పదని ఏప్రిల్‌ 28న యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ హెచ్చరించింది. 

అప్పటి నుంచి ఎన్నికలు ఎన్నిసార్లు నిర్వహించాలని చూసినా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సభ్యత్వాన్ని సస్పండ్ చేస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం తీసుకుంది. నిజానికి మే 7న డబ్లుఎఫ్‌ఐ కార్యవర్గానికి ఎన్నికలు జరగవలసి ఉండగా ఈ ప్రక్రియను అక్రమమంటూ క్రీడా శాఖ నిలిపివేసింది.