లోదుస్తుల రంగులు చెప్పాలని విద్యార్థినిలకు వేధింపులు!

లోదుస్తుల రంగులు చెప్పాలని విద్యార్థినిలకు వేధింపులు!
అనంతపురం జిల్లాలో లైబ్రేరియన్​పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. విద్యార్థినిలతో లైబ్రేరియన్​ ప్రవర్తన సరిగా ఉండటం లేదని పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అతనిని చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లైబ్రేరియన్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 
 
అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, గత ప్రిన్సిపాల్ కావాలనే ఇలా చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్​గా భానుప్రకాశ్‌ నాయక్‌ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థినులను లైగింకంగా వేధిస్తున్నాడని పాఠశాలకు చేరుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు భాను ప్రకాశ్​ను చితకబాదారు. 
 
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ప్రిన్సిపల్​ ఎదుటే లైబ్రేరియన్​కు దేహశుద్ధి చేశారు. గత కొన్ని రోజులుగా లైబ్రేరియన్​ విద్యార్థినిలను లైగింకంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై ప్రిన్సిపల్​కూ ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు. అయినప్పటికీ ప్రిన్సిపల్​ స్పందించలేదని తెలిపారు.  లైబ్రేరియన్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయ ఉన్నతాధికారులతో తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ కరీమ్‌ఖాన్‌ మాట్లాడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడి లైంగిక ఆరోపణల గురించి వారికి వివరించారు.
 
విద్యార్థినుల తల్లిదండ్రుల మాట్లాడుతూ.. విద్యార్థులతో మసాజ్‌లు చేయించుకోవడం, కాళ్లు నొక్కమనడం, ఇంట్లో వాళ్ల వివరాలు అడుగుతున్నాడని.. అసభ్యకరంగా మాట్లాడటం, పిల్లల లోదుస్తుల కలర్ కూడా అడుగుతున్నాడని ఆరోపించారు. ఏదైనా మాట్లాడితే విద్యార్థులను ఐరన్ స్కేలుతో కొడుతున్నారని.. దీంతో పిల్లలు స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారని చెప్పారు. 
 
ప్రైవేట్ పార్ట్స్‌లో టచ్ చేస్తున్నారని.. ఇంట్లో చెబితే టీసీ ఇస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని తెలిపారు. లైబ్రేరియన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లైబ్రేరియన్ వికృత చేష్టలపై మూడు రోజుల క్రితమే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. అయితే ఈ విషయం తెలిసి లైబ్రేరియన్ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.