శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 15 వరకూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ విధించారు. ఈ క్రమంలో అప్పటి వరకూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్‌ఎఫ్), పోలీసులతో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. 

అంతేకాకుండా, ఆగస్టు 15 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లుగా ప్రకటించారు. విమానాలు ఎక్కే ప్రయాణికులతో పాటు వారిని సాగనంపడానికి కుటుంబ సభ్యులు ఎయిర్ పోర్టుకు వస్తుండే సంగతి తెలిసిందే. అయితే, ఈ హైఅలర్ట్ నేపథ్యంలో ఒకరిద్దరే రావాలని ఎయిర్ పోర్టు అధికారులు సూచిస్తున్నారు. 

అన్ని రకాల పాసులను ఆగస్టు 16 వరకూ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో పార్కింగ్, డిపార్చర్, ఆగమనాలు విభాగాల్లో సిఐఎస్‌ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు మొదలు పెట్టారు. 

విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు వీడ్కోలు పలకడానికి ఒకరు లేదా ఇద్దరు సందర్శకులు రావాలని, అంతేకానీ, అధిక సంఖ్యలో వస్తే అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది హైయ్యర్ స్టడీస్ కోసం ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. 

ఇలా విదేశాలకు వెళ్లే విద్యార్థుల రాకతో సందర్శకులు కూడా వస్తున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఒక్కరిని పంపించడానికి తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అందుకే, భద్రత నేపథ్యంలో వచ్చే 15 రోజులు సందర్శకులు రావద్దని కేంద్ర బలగాలు అలర్ట్ చేస్తున్నాయి.