మరోసారి బిఆర్‌ఎస్ వస్తే తెలంగాణకు తిరోగమనమే

మరోసారి బిఆర్‌ఎస్ వస్తే తెలంగాణకు తిరోగమనమే

మరోసారి బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్ తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమన దిశలో వెళ్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి హెచ్చరించారు.  శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర, జిల్లాల అధికార ప్రతినిధులు, జిల్లాల మీడియా ఇంచార్జ్‌లు సోషల్ మీడియా ప్రతినిధులకు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. ఆ పార్టీకి గడ్డుకాలం ఉందని అనేక సర్వేల్లో వాళ్లకు తెలిసింది కాబట్టే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బిజెపి ఎమ్మెల్యేలను మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. 

ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణకు ఏ రకంగా నిధులు ఇచ్చామో చెప్పేందుకు బిజెపి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది. జాతీయ రహదారుల నుంచి మొదల గ్రామ పంచాయతీ రోడ్ల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని తేల్చి చెప్పారు. 

అమరవీరుల బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్, ఎంఐఎం, బిఆర్‌ఎస్ ఈ మూడు పార్టీలు కూడా ఒకే రకమైన డిఎన్‌ఏతో ఉన్న పార్టీల అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అవి కుటుంబ, అవినీతి పార్టీలని చెప్పారు. 

12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా చేతి గుర్తుతో గెలిచి బిఆర్‌ఎస్‌లో చేరారని గుర్తుచేశారు. ఈ రోజైనా, భవిష్యతులో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒక్కటేనని తేల్చి చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తాం అని కిషన్ రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13, 14, 15 మూడు రోజులు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలను ఆయన కోరారు. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రతి ఇంటి నుంచి మట్టి సేకరించి ఢిల్లీలో స్మారక కేంద్రంలో కలిపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపిచ్చారు. 

ఇది దేశం కోసం అమరులైన వీరులకు నివాళి అర్పించే కార్యక్రమం అని చెబుతూ ఇందులో ప్రతి గ్రామంలోని యువత భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల బాధ్యుడు, మాజీ కేంద్ర మంత్రి  ప్రకాశ్ జవదేకర్, జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇర్ఫాన్, సీతాశాల్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, ఈటల రాజేందర్  కూడా పాల్గొన్నారు.