కశ్మీర్‌లో సెలవుపై వచ్చిన జవాన్‌ అదృశ్యం

కశ్మీర్‌లో సెలవుపై వచ్చిన జవాన్‌ అదృశ్యం
పండుగకు ఇంటికి వెళ్లిన ఓ భారత జవాను అదృశ్యమయ్యాడు. ఈ ఘటన కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో శనివారం జరిగింది. జమ్మూ- కశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన జావేద్‌ అహ్మద్‌(25) ఈద్‌ పండుగ జరుపుకునేందుకు సెలవులు పెట్టుకుని ఇంటికి వెళ్లాడు. 
 
సోమవారం అతడు తిరిగి విధుల్లో చేరవలసి ఉంది.  దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా అచతల్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సైనికుడు జావెద్ అహ్మద్ వనీ ఇంట్లోకి సరుకులు తీసుకొచ్చేందుకు శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మార్కెట్‌కు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి 9 గంటల వరకు ఎదురుచూసి, తల్లిదండ్రులు అతడి కోసం వెతకడం మొదలు పెట్టారు. 
 
మార్కెట్‌కు సమీపంలో జావేద్‌ కారు కనిపించింది. కారులో రక్తపు మరకలు ఉన్నాయని స్థానికులు చెపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సైన్యం రంగంలోకి దిగింది. జావెద్ కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

 
కాగా, తమ కొడుకును ఉగ్రవాదులే కిడ్నాప్‌ చేసి ఉంటారని జావేద్‌ తల్లిదండ్రులు భావిస్తున్నారు. దాంతో ‘‘మా కొడుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే అందుకు మేము క్షమాపణలు చెపుతున్నాం. కావాలంటే మా అబ్బాయిని ఆర్మీలో ఉద్యోగం మానిపిస్తాం. దయచేసి మా కొడుకును విడిచిపెట్టండి’’ అంటూ జావేద్‌ తల్లిదండ్రులు మొర పెట్టుకున్నారు.