చంద్రయాన్-3 చివరి భూ కక్ష్య పెంపు విజయవంతం

చంద్రయాన్-3 చివరి భూ కక్ష్య పెంపు విజయవంతం

చంద్రునిపై పరిశోధనలకు బయలుదేరి వెళ్తున్న చంద్రయాన్ 3 వ్యోమనౌక తన లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో భూమి చుట్టూ తిరిగిన ఈ వ్యోమనౌకకు సంబంధించిన ఐదో కక్ష పెంపును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మంగళవారం విజయవంతంగా నిర్వహించింది.

 బెంగళూరు లోని ఇస్రో టెలీ మెట్రీ , ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. దీంతో చంద్రయాన్ ఇప్పుడు 12,76,069 కిమీ x236 కిమీ దూరం లోని కక్ష లోకి చేరుకునే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది. ఇదిలా ఉండగా భూమి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్ 3 కి సంబంధించి ఇది చివరి కక్ష. 

దీని తర్వాత వ్యోమనౌక చంద్రుడి కక్ష్య లోకి ప్రవేశిస్తుంది. ఈ విన్యాసాన్ని ఆగస్టు 1 న చేపట్టనున్నట్టు ఇస్రో తెలిపింది.  భూమి చుట్టూ తిరిగే చివరి రౌండును ఆగస్టు 1 వ తేదీ రాత్రి 12 గంటలకు పూర్తి చేసుకొని తదుపరి చంద్రుని వైపుకు వెళ్లే ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. 

భూమి చుట్టూ తిరిగే చంద్రయాన్‌-3 చివరి రౌండ్‌ భూమికి దగ్గరగా 236 కిలోమీటర్లు భూమికి దూరపు కక్ష 1,27,609 కిలోమీటర్లు తిరిగిన అనంతరం చంద్ర కక్ష వైపుగా ప్రయాణం మొదలు పెడుతుంది. జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్య లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు తొలిసారిగా దీని కక్షను పెంచారు. 

ఇప్పటివరకు దశల వారీగా అయిదు సార్లు పెంచి, చంద్రయాన్ 3 ని జాబిల్లికి చేరువ చేస్తున్నారు. అయిదో భూకక్ష్య పూర్తయిన తర్వాత ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్య లోకి వెళ్తుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్ అడుగు పెడుతుంది.