కేశవరావు కుమారులపై భూకబ్జా కేసు

ఓ ఎన్ఆర్ఐ మహిళకు చెందిన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలతో బాధితుల ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కే కేశవరావు ఇద్దరు కుమారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎన్బీటీనగర్ సర్వే నెంబర్ 129(కొత్త సర్వే నెంబర్ 403)లో షేక్ అలీఖాన్ అహ్మద్ నుంచి 939 గజాల స్థలాన్ని బంజారాహిల్స్‌కు చెందిన పీ సుదర్శన్ రెడ్డి(ప్రస్తుతం ఆయన మరణించారు) 470 గజాలు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో నివసించే జయమాల 469 గజాల స్థలాన్ని 1983లో సంయుక్తంగా కొనుగోలు చేశారు.

సుదర్శన్ రెడ్డి దక్షిణం, జయమాల ఉత్తరం వైపు భాగాలు తీసుకున్నారు. తర్వాత జయమాల అమెరికాలో స్థిరపడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని జయమాల నివసించిన ఇంటికి ఆమె స్థలం విక్రయిహించిన దానిపై పన్ను కట్టలేదంటూ గత సంవత్సరం ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేయడంతో ఆమె విస్తుపోయింది. 
 
 2014-15 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 2,13,67,500లకు స్థలాన్ని విక్రయించారని, పెట్టుబడి మీద వచ్చిన లాభానికి సంబంధించి చెల్లించాల్సిన పన్ను, పెనాల్టీ కలిపి రూ. 1,40,41,300 చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో నోటీసులు అందడంతో షాకైన జయమాల. ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు కొద్ది రోజుల క్రితం అమెరికా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. 
 
2019లో ఎంపీ కే కేశవరావు కుమారుడు, తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ విప్లవ్ కుమార్‌కు స్థలంపై అధికార హక్కులతో కూడిన స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తాను ఇచ్చినట్లు ఉన్న పత్రాలను జయమాల గమనించారు. జులై 19, 2013లో ఆ స్థలాన్ని తన సోదరుడు కే వెంకటేశ్వర్ రావు అలియాస్ వెంకట్‌కు రూ. 3 లక్షలకు విక్రయించినట్లు రిజిస్టర్ దస్తావేజులను ఆమె గుర్తించారు. 
 
తన సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన జయమాల ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫలతం లేకపోవడంతో ఇటీవల మూడో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో జూన్ 13న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కే కేశవరావు కుమారులు విప్లవ్ కుమార్ ఎ-1, వెంకటేశ్వర్ రావును ఎ-2గా చేర్చారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.