కేంద్ర ఆర్డినెన్స్‌‌పై `సుప్రీం’లో ఆప్ కు ఎదురుదెబ్బ

కేంద్ర ఆర్డినెన్స్‌‌పై `సుప్రీం’లో ఆప్ కు ఎదురుదెబ్బ

దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను తుది మధ్యవర్తిని చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్  మెట్లెక్కిన ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఆర్డినెన్స్‌‌ను నిలుపుదల చేయబోమంటూ సుప్రీంకోర్ట్ తేల్చిచెప్పింది. 

అయితే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వైఖరిని తెలియజేయాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు లెఫ్టనెంట్ గవర్నర్‌ని ఇంప్లీడ్ చేస్తూ పిటిషన్‌ను సవరించుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీని కోరింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జడ్జి పీఎస్ నరసింహ కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసుపై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రీసెర్చ్ ఆఫీసర్స్, ఫెలోస్ వంటి 400 మంది స్పెషలిస్టులను గవర్నర్ తొలగించడాన్ని ఆప్ ప్రభుత్వం సవాలు చేసిన పిటిషన్‌పై కూడా సోమవారమే వాదనలు విననున్నట్టు కోర్టు వెల్లడించింది. 

కాగా ఢిల్లీ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఒక ‘సూపర్ సీఎం’గా మాదిరిగా ప్రవర్తిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్లుబాటును ప్రశ్నించింది. ఈ ఆర్డినెన్స్‌పై తాత్కాలికంగా స్టే విధించాలని కోరింది. ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న 400 మంది తొలగింపును కూడా రద్దు చేయాలని ఆప్ ప్రభుత్వం కోరింది. 

దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల జీవిత భాగస్వాములే ఆయా పదవుల్లో ఉన్నారని వాదించారు. దీనిపై స్పందించేందుకు కేంద్రానికి సమయం ఇస్తున్నట్టు కోర్ట్ తెలిపింది.