ఫోర్బ్స్ మహిళా సంపన్నులలో నలుగురు భారత సంతతి వనితలు

ఫోర్బ్స్ మహిళా సంపన్నులలో నలుగురు భారత సంతతి వనితలు

ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల జాబితాలో నలుగురు భారతీయ- అమెరికన్‌ వనితలు చోటు దక్కించుకున్నారు. జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథి, నేహా నార్ఖేడే, ఇంద్రా నూయి ఈ కీర్తి గడించారు. అమెరికాలో అత్యంత విజయవంతమైన, సగటు సంపద 124 బిలియన్‌ డాలర్లు కలిగిన వంద మంది మహిళా వ్యాపారవేత్తలు, ఎగ్జిక్యూటివ్‌ల సరసన నిలిచారు. వీరి సంపద గత ఏడాది కంటే 12 శాతం ఎక్కువ.

కాగా, 62 ఏళ్ల జయశ్రీ ఉల్లాల్‌ సిలికాన్ వ్యాలీ ఇంజినీర్, సిస్కో మాజీ నిఫుణురాలు. ఫోర్బ్స్ 2023 సంపన్న మహిళల ర్యాంకులో 15వ స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 2.2 బిలియన్ డాలర్లు. జయశ్రీ ఉల్లాల్‌ 2008లో కంప్యూటర్ నెట్‌వర్కింగ్ కంపెనీ అరిస్టా నెట్‌వర్క్స్‌లో సీఈవోగా చేరారు.  నాడు ఎలాంటి అమ్మకాలు లేని ఆ సంస్థను పబ్లిక్‌ ట్రేడ్‌ కంపెనీగా అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆమె నేతృత్వంలో ఉన్న ఆ సంస్థ 2022లో 4.4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని గడించింది. గత ఏడాదితో పోల్చితే ఆ కంపెనీ ఆదాయం 48 శాతం పెరిగినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.

మరోవైపు 68 ఏళ్ల నీర్జా సేథి, ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల ర్యాంకులో 25వ స్థానంలో ఉన్నారు. ఆమె నికర సంపద విలువ 990 మిలియన్‌ డాలర్లు. నీర్జా సేథి1980లో మిచిగాన్‌లోని ట్రాయ్‌లో సొంత అపార్ట్‌మెంట్‌లో భర్త భరత్ దేశాయ్‌తో కలిసి ఐటీ కన్సల్టింగ్, ఔట్‌సోర్సింగ్ సంస్థ సింటెల్‌ను స్థాపించారు. 2018లో ఆ సంస్థను ఫ్రెంచ్ ఐటీ సంస్థ అటోస్ ఎస్‌ఈకి 3.4 బిలియన్‌ డాలర్లకు విక్రయించారు.

ఇక 38 ఏళ్ల నేహా నార్ఖెడే, ఫోర్బ్స్ 2023 మహిళా సంపన్నుల ర్యాంకులో 50వ స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 520 మిలియన్‌ డాలర్లు. నేహా నార్ఖెడే, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి వ్యాపారవేత్తగా మారారు. 2021లో భర్తతో కలిసి 20 మిలియన్‌ డాలర్ల నిధులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో కంపెనీ మోసాలను గుర్తించే సంస్థ ఓస్కిలార్‌ను ప్రారంభించారు.

కాగా, 67 ఏళ్ల ఇంద్రా నూయి, ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల ర్యాంకులో 77వ స్థానంలో ఉన్నారు. ఆమె నికర సంపద విలువ 350 మిలియన్‌ డాలర్లు. అమెరికాలోని టాప్‌ 50 కంపెనీలలో ఒకటైన పెప్సికోను చాలా కాలం సమర్థవంతంగా నిర్వహించారు. భారత్‌లోని చెన్నైలో జన్మించిన ఆమె, అమెరికా టాప్‌ కంపెనీలో అతి పెద్ద బాధ్యతలు చేపట్టిన తొలి అమెరికాయేతర మహిళ. 

12 ఏళ్ల పాటు పెప్సికో సీఈవోగా ఉన్న ఆమె 2018లో ఆ పదవికి, 2019లో ఛైర్‌పర్సన్‌గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం అమెజాన్‌ సంస్థతోపాటు, హెల్త్ టెక్ సంస్థ ఫిలిప్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే గత ఏడాది నవంబర్‌ నుంచి కుంభకోణంలో చిక్కుకున్న డ్యుయిష్ బ్యాంక్, గ్లోబల్ అడ్వైజరీ కొత్త బోర్డులో సభ్యురాలిగా సేవలందిస్తున్నారు.