తెలంగాణాలో బీజేపీని బలోపేతం చేసే దిశగా పని చేస్తాం

తెలంగాణాలో బీజేపీని బలోపేతం చేసే దిశగా పని చేస్తాం
తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా నియమించడంతో తాను అలకవహించినట్లు మీడియాలో వస్తున్న కథనాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొట్టిపారవేసారు. అధ్యక్ష పదవిపై ఎలాంటి అలకా లేదని చెబుతూ పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా పని చేస్తానని పేర్కొంటూ  ఎవరైనా పార్టీ విధానాన్ని అనుసరించాల్సిందే అని తేల్చి చెప్పారు. 
నాలుగో సారి పార్టీ అధ్యక్షునిగా ఎంపికైనట్లు చెబుతూ ఉమ్మడి ఏపీలో రెండు సార్లు, తెలంగాణాలో మొదటిసారి అధ్యక్ష పదవి చేపట్టినట్లు గుర్తు చేశారు.  పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తినని, పార్టీకి మించింది ఏదీలేదని తెలిపారు.  తాను పార్టీకి విధేయుడనని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని ఇప్పటి వరకు తాను పార్టీని ఏమీ కోరలేదని, అన్ని తనకు పార్టీ ఇచ్చిందని చెబుతూ  పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 
వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీని అధికారంలోకి తీసుకు వస్తామని, అందుకోసం కేంద్ర, రాష్త్ర నాయకత్వంలతో కలిసి పనిచేస్తామని భరోసా వ్యక్తం చేశారు.
బీజేపీలో ఒక్కరికీ ఒక్కటే పదవి ఉంటుందని, ఈ నేథ్యంలో త్వరలోనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు తానే ఉంటానని చెప్పారు.
ఇక జులై 8న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యనటకు రానున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 8 గంటలకు పదాధికారులతో సమావేశం జరుగుతుంది. ఇందుకు హాజరుకానున్న కిషన్ రెడ్డి మోదీ పర్యటనపై చర్చిస్తారు. గురువారంవరంగల్ లోనే ఉండి సభా ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ప్రధాని మోదీ సభ తర్వాతనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది.