
పార్టీ వ్యవహారాలపై, నాయకత్వంపై కొందరు ప్రముఖ నాయకులే అసమ్మతి వ్యక్తం చేస్తూ బహిరంగ ప్రకటనలు చేయడం, మీడియా లీకులు ఇవ్వడం పట్ల తెలంగాణ బీజేపీ సీరియస్ అయింది. పార్టీకి చెందిన కొందరు నాయకులు, పార్టీకి నష్టం చేకూరేలా చేస్తోన్న అవాంఛనీయ బహిరంగ ప్రకటనలు, మీడియా లీకులు, యథాలాపంగా చేస్తోన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు తెలిపారు.
ఇలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తోన్న వాళ్లు తాము అసలు ఏ పార్టీలో ఉన్నామో మర్చిపోయినట్టున్నారని ఘాటుగా విమర్శించారు. ఇది బీజేపీ అని, బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ కాదని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీనీ, పార్టీ నాయకత్వాన్నీ బహిరంగంగా విమర్శించే సంస్కృతి, వ్యవసథా బీజేపీలో లేదని, ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తోన్న వాళ్లంతా దాదాపు ఏదో ఒక రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీల్లో ఉన్నవాళ్ళే అని ఆయన గుర్తు చేశారు. వారికి తమ గొంతు వినిపించడానికి పార్టీ తగిన అవకాశం, వేదిక ఇచ్చింది కూడా అని తెలిపారు. పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఎజెండాలు ఎప్పటికీ ఎక్కువ కాదని కృష్ణసాగర్ రావు స్పష్టం చేశారు.
పార్టీలో ఒక ‘లక్ష్మణ రేఖ’ ఉందని మర్చిపోకూడదని ఆయన హెచ్చరించారు. పార్టీపైనా, పార్టీ నాయకత్వంపైనా బాధ్యతారాహిత్యమైన, అవాంఛనీయమైన ప్రకటనలు చేయడం అంటే పార్టీని నష్టపరచాలనే ఉద్దేశాన్ని బహిరంగంగా చెప్పినట్లే అవుతుందని ఆయన తేల్చి చెప్పారు. “మా పార్టీలో ఈ తరహా క్రమశిక్షణా రాహిత్యం, నిర్లక్ష్యపూరిత వైఖరి సహించబడదు” అని ఆయన స్పష్టం చేశారు.
More Stories
అత్యుత్తమ పరిశోధన కేంద్రంగా సమ్మక్క, సారక్క యూనివర్సిటీ
మహిళల చైతన్యం కోసం సప్త శక్తి సంగం
ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేత పంపిణీపై బిజెపి ఫిర్యాదు