కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలు

కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలు

కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ కోరినప్పుడు తాను తిరస్కరించినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేసిన పనికంటే రెండింతలు బిజెపి 9 ఏళ్లలోనే చేసినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.

బిజెపి 9 ఏళ్ల పాలనపై మహారాష్ట్రలోని భండారాలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. ‘‘మీరు చాలా మంచి కార్యకర్త, నాయకుడు. మీరు కాంగ్రెస్‌లో చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది’’ అని తనకు కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ చెప్పారని గడ్కరీ తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్‌కు విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో ఉన్నపుడు తనకు విలువలు నేర్పించినందుకు ఆర్ఎస్ఎస్‌పై పొగడ్తలు కురిపించారు.

భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, సమర్థత పట్ల తనకు చెక్కుచెదరని నమ్మకం ఉందని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. ‘‘కానీ కాంగ్రెస్‌లో చేరడం కంటే బావిలో దూకడమే మేలని నేను ఆయనతో చెప్పాను. ఎందుకంటే బిజెపి, దాని సిద్ధాంతాలపై నాకు బలమైన విశ్వాసం ఉంది. అందుకోసం నేను పని చేస్తూనే ఉంటాను’’ అని వివరించారు.

కాంగ్రెస్ లో ఎన్నోసార్లు చీలిక వచ్చిందని గడ్కరీ గుర్తు చేశారు. ‘‘మనదేశ ప్రజాస్వామ్య చరిత్రను మనం మర్చిపోకూడదు. గతం నుంచి మనం నేర్చుకోవాలి. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది. కానీ నెరవేర్చలేకపోయింది. స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసింది’’ అని ఆరోపించారు.
దేశాన్ని అసలైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ సఫలుడయ్యాడని గడ్కరీ కొనియాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశాన్ని ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేసేందుకు దార్శనికతతో కృషి చేస్తున్నారని చెబుతూ దేశానికి గొప్ప భవిష్యత్తు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.