భారత్‌ వేదికగా ప్రపంచ సుందరి పోటీలు

ప్రపంచ సుందరి పోటీలకు సుమారు మూడు దశాబ్దాల తర్వాత భారత్ మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది.  మొదటిసారి 1996లో ఈ అంతర్జాతీయ పోటీలు భారత్‌ వేదికగా జరిగాయి. 71వ ప్రపంచ సుందరి – 2023  ఫైనల్‌ పోటీలు నవంబరు నెలలో జరగనున్నాయి. తుది తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
 
‘‘71వ మిస్ వర్డల్ పోటీలు భారత్ వేదికగా జరుగుతాయని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాం.130 దేశాల జాతీయ ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నెల రోజులు విడిది చేస్తారు. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడా సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయి. మార్పునకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వీటి ఉద్దేశం.. ’’ అని మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌, సీఈవో జులియా మోర్లే తెలిపారు.
 
ప్రచారం కోసం భారత్‌కు వచ్చిన ప్రపంచ సుందరి 2022 విజేత కరోలినా బియెలావ్‌స్కా (పోలండ్‌) మాట్లాడుతూ  ‘‘గొప్ప ఆతిథ్యానికి, విలువలకు ప్రతిరూపమైన ఈ అందమైన దేశంలో నా కిరీటాన్ని తదుపరి విజేతకు అలంకరించేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా” అని సంతోషం వ్యక్తం చేశారు.
 
“నేను ఇక్కడు రావడం ఇది రెండోసారి. నాకు సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుంది. మీరు విలువల కోసం నిలబడతారు. భిన్నత్వంలో ఏకత్వం, కుటుంబ సంబంధాలు, గౌరవం, ప్రేమ, దయ వంటి మీ ప్రధాన విలువలను మేము ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాం. ఇక్కడ చూడటానికి ఇంకా చాలా ఉన్నాయి.. ఒక నెల మొత్తం ప్రపంచాన్ని ఇక్కడికి తీసుకురావడం, భారతదేశం అందించే ప్రతిదాన్ని చూపించాలనేది మా ఆలోచన ’’ అని ఆమె పేర్కొన్నారు.

‘భారతదేశం అంటే ఏమిటో.. మన వైవిధ్యం ఏమిటో చూపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా సోదరీమణులందరినీ భారతదేశానికి స్వాగతించి, వారిని కలవడానికి నేను చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. మీరు భారతదేశంలో ఇక్కడ ఉత్తమ సమయాన్ని కలిగి ఉన్నారని నేను ఆశిస్తున్నాను’ అని  ఈ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న మిస్‌ ఇండియా వరల్డ్‌ సినీ శెట్టి తెలిపారు. 

 
ఇప్పటి వరకూ భారత్ నుంచి ప్రపంచ సుందరిగా ఆరుగురు ఎంపికయ్యారు. మొదటిసారి రీటా ఫరియా (1966), తర్వాత ఐశ్వర్యారాయ్‌ (1994), డయానా హెడెన్‌ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంకా చోప్రా (2000), మానుషి చిల్లర్‌ (2017) మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు.