
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నవంబర్ లో జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం తన చర్యలను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. 2018లో డిసెంబర్ లో జరిగాయి. కానీ ఈ సారి కొంచెం ముందుగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం అధికారుల బదిలీ ప్రక్రియపై సర్క్యులర్ జారీ చేసిన ఎన్నికల కమీషన్ శనివారం మాస్టర్ ట్రైనర్లకు శిక్షణకు సంబంధించిన మరో సర్క్యులర్ ను ఇచ్చింది.
మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పని చేస్తున్న అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలకు సంబంధం ఉండే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో పాటు కింది స్థాయి సిబ్బంది బదిలీలు జులై 31 లోపు పూర్తికానుంది.
ఈ నెల 5వ తేదీ నుంచి 10 వ తారీఖు వరకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి లెక్కింపు వరకు అనుసరించాల్సిన పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.99 కోట్ల మంది ఓటర్లున్నారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశం ఉన్నదని అంచనా.
రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 మందికి శిక్షణ ఇస్తారు. వీళ్లు కింది స్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి? అందులో ఎన్ని పనిచేస్తున్నాయి. ఇంకా ఎన్ని కావాలి? అనే అంశాలపైనా ఈసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈసీ చర్యలు వేగవంతం చేసిన నేపథ్యంలో ఎన్నికలకు ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చనే వాదన బలంగా వినిపిస్తున్నది. అక్టోబర్ చివరి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు