జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 తాత్కాలికమే

జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 తాత్కాలికమే

జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్  370 తాత్కాలికమని కేంద్ర హోంమంత్రి అమిత్  షా స్పష్టం చేశారు. మన రాజ్యాంగ నిర్మాతలు తెలివిగా దానిని రాజ్యాంగంలో చేర్చారని పేర్కొన్నారు. ఢిల్లీలో సోమవారం లెజిస్లేటివ్  డ్రాఫ్టింగ్ పై నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తూ  చట్టాన్ని సరిగ్గా రాస్తే, ఏ కోర్టు కూడా ఏ చట్టానికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పారు.

‘‘డ్రాఫ్టింగ్  సులభంగా, స్పష్టంగా ఉంటే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం తేలికగా ఉంటుంది. ఫలానా అంశం గురించి పూర్తిగా వివరించకుండా సగం సగం వివరిస్తే, అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి” అని షా తెలిపారు. ఆర్టికల్  370 రద్దుపై స్పందిస్తూ దేశమంతా ఆ ఆర్టికల్​ను రద్దు చేయాలని కోరుకుందని తెలిపారు.

‘‘ఆర్టికల్​ 370పై జరిగిన చర్చలు  కూడా రాజ్యాంగ పరిషత్తు చర్చల రికార్డుల్లో లేవు. అసలు ఏం చర్చించారో కూడా ప్రింట్లు లేవు. ఆర్టికల్ 370ని డ్రాఫ్ట్  చేసిన వారు, రాజ్యాంగ పరిషత్తులో భాగమైన వారు ఎంత తెలివిగా దానిని రాజ్యాంగంలో చేర్చి ఉంటారో  ఊహించవచ్చు. ఎన్నో ఆలోచనల తర్వాత ‘తాత్కాలికం’ అన్న పేరు చేర్చారు. అయితే, రాజ్యాంగంలో ఆర్టికల్  టెంపరరీగా ఉండకూడదు. దానిని సవరించవచ్చు” అని షా వివరించారు.

చట్టం అనేది కేబినెట్ లేదా పార్లమెంటు సంకల్పాన్ని ప్రతిఫలింపచేయాలని అమిత్ షా సూచించారు. చట్టం సులభంగా, స్పష్టంగా ఉన్నపుడే దానిపై వివాదం జరగకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టంను సమర్థవంతంగా రూపొందించని పక్షంలో చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్యం బలహీనమవుతాయని అమిత్ షా హెచ్చరించారు.

చట్టసభల సభ్యులు న్యాయనిపుణులు కాదని, వారు ప్రజా ప్రతినిధులని, వారికి ప్రజల సమస్యలు, వారి అభిలాషలు మాత్రమే తెలుస్తాయని అమిత్ షా గుర్తు చేశారు. అందుకనే ప్రజలను దృష్టిలో ఉంచుకొనే వారు చట్టాలను తీసుకు వస్తారని, అయితే ఆ చట్టాలను రాజ్యాంగ స్ఫూర్తి పరిధిలో ఉండేవిధంగా మార్చడం న్యాయ విభాగం గురుతర బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

 చట్టాల స్పూర్తిని కాపాడేలా డ్రాఫ్టింగ్  చేయడం ముఖ్యమని ఆయన సూచించారు. ఇక, మోదీ  ప్రభుత్వం చట్టాల్లో చాలా మార్పులు చేసిందని షా తెలిపారు. తమ ప్రభుత్వం దాదాపు 2 వేల అసందర్భమైన చట్టాలను రద్దుచేసిందని, అంతేకాకుండా కొత్త చట్టాలను రూపకల్పన చేసేందుకూ వెనుకాడలేదని ఆయన చెప్పారు.