
74 ఏండ్ల బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషేకం ఈ నెల 6న అంగరంగ వైభవంగా జరగనుంది. ఆయన తల్లి, ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్ను పాలించిన రాణి ఎలిజబెత్ 2 నిరుడు సెప్టెంబరులో మరణించిన తర్వాత చార్లెస్ 3 సింహాసనాన్ని అధిష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పరేడ్లు జరపనున్నారు. భారత్ తరపున ఉపాధ్యక్షుడు జగదేవ్ ధన్ఖడ్ ఈ వేడుకలకు హాజరవుతారు.
చార్లెస్ 3 పట్టాభిషేక వేడుకలకు తన భార్య మేఘన్ లేకుండానే ప్రిన్స్ హ్యారీ హాజరు కానున్నారు. ఈ మేరకు బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలను ఉటంకిస్తూ బీబీసీ పేర్కొంది. రాజ కుటుంబ సభ్యులకు పది వరుసల వెనుక హ్యారీకి సీటు కేటాయించారు. తన కొడుకు అర్కీ బర్త్ డే ఉండడంతో కార్యక్రమం ముగిసిన వెంటనే హ్యారీ అమెరికా బయల్దేరతారు. పట్టాభిషేక ఏర్పాట్లను ‘ది ఆపరేషన్ గోల్డెన్ ఆర్బ్ కమిటీ’ చూసుకుంటోందని టైమ్ మేగజీన్ తెలిపింది.
రాజు చార్లెస్ 3 పట్టాభిషేకంలో ఆయన భార్య కమిల్లా కోహినూర్ వజ్రం ధరించకుండానే ఈ కార్యక్రమంలో కనిపించనున్నారు. కోహినూర్ ను వెనక్కి ఇచ్చేయాలని భారత్ గత కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాజ కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాణి కమిల్లా కోహినూర్ ధరించి వేడుకల్లో పాల్గొంటే భారత్ తో దౌత్యపరమైన సమస్యలు రావొచ్చని బ్రిటన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో కోహినూర్ కు బదులుగా క్వీన్ మేరీ కిరీటాన్ని ఆమె ధరించనున్నారు. చార్లెస్ 3 పట్టాభిషేకానికి 203 దేశాల నుంచి 2200 మంది అతిథులు హాజరు కానున్నారు.
అతిథుల్లో వంద దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఉన్నారు. అలాగే రాజ కుటుంబానికి సేవలందిస్తున్న ఇండియన్ కమ్యూనిటీ వర్కర్లకూ ఆహ్వానం అందింది. వారిలో ప్రిన్స్ ఫౌండేషన్ బిల్డింగ్ క్రాఫ్ట్ ప్రోగ్రాంలో గ్రాడ్యుయేషన్ చేసిన సౌరభ్ ఫాడ్కే (37) కూడా ఉన్నారు. చార్లెస్ వేల్స్ రాకుమారునిగా ఉన్నపుడు స్కాట్లాండ్లో ఈ స్కూల్ ను స్థాపించారు.
ఈ కార్యక్రమానికి సుమారు 100 మిలియన్ పౌండ్లు ఖర్చుపెడుతున్నట్లు అంచనా. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.1020 కోట్లు అన్నమాట. ఈ పట్టాభిషేకానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే కార్యక్రమ టీవీ ప్రసార హక్కుల నుంచి వచ్చే ఆదాయమే భారీగా ఉండనున్నట్లు సమాచారం. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగే ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని 3.7కోట్ల మంది వీక్షిస్తారని అంచనా. ఈ కార్యక్రమం కోసం 700 ఏండ్ల చారిత్రక నేపథ్యం కలిగిన ఓ కుర్చీని కూడా సిద్ధం చేస్తున్నారు.
కాగా, 1953లో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-11 పట్టాభిషేక మహోత్సవం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నేరుగా 3 లక్షల మంది తిలకించారట. అప్పట్లోనే రాణి పట్టాభిషేకానికి 1.5 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టారట. ప్రస్తుత కరెన్సీ విలువతో పోలిస్తే అది సుమారు 50 మిలియన్ పౌండ్లు. అంటే సుమారుగా రూ.528.7 కోట్లన్నమాట.
More Stories
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!