వందే భారత్‌ రైళ్ల కోసం రష్యాతో ఒప్పందం

అతివేగంగా నడుస్తున్న వందే భారత్‌ రైళ్ల కోసం రష్యాతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రష్యా వార్త సంస్థ టాస్‌ (టిఎఎస్‌ఎస్‌) తాజాగా వెల్లడించింది. 120 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఉత్పత్తి, సరఫరా, నిర్వహణ కోసం రష్యాకు చెందిన ట్రాన్స్‌మాష్‌హోల్డింగ్‌ (టిఎంహెచ్‌)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది.
 
బహుశా ఈ ఏడాది జూన్‌ 1 నాటికి వందే భారత్‌ రైళ్ల ఒప్పందాన్ని భారత్‌ కుదుర్చుకునే అవకాశముందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్‌ రైళ్లను సరఫరా చేసేందుకు గాను 1.8 బిలియన్‌ డాలర్లను భారతీయ రైల్వే రష్యాకు చెల్లించనుంది.  ఇక 35 సంవత్సరాల రైళ్ల నిర్వహణ కోసం మరో 2.5 బిలియన్‌ డాలర్లను మొత్తం ఈ రైళ్ల కోసం 6.5 బిలియన్‌ డాలర్ల మేర భారత్‌ ఒప్పందం చేసుకోనున్నట్లు రష్యా వార్త సంస్థ పేర్కొంది.
 
కాగా, ‘వందే భారత్‌ రైళ్ల కోసం నిర్ణయం తీసుకోబడింది. కానీ దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయలేదు. బహుశా మార్చి 29వ తేదీ నుంచి 45 రోజుల్లోపు ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశముందని’ టిఎంహెచ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కిరిల్‌ లిపా ఇటీవల చెప్పారు.  16-కోచ్‌ 120 వందే భారత్‌ రైళ్లలో ఒక్కొక్కటి లాతూర్‌లోని మరఠ్వాడా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి ఉత్పిత్తి అవనున్నాయి.
బహుశా ఈ రైళ్లన్నీ 2026 నుంచి 2030 సంవత్సరంలోపు డెలివరీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి రెండు నమూనా ట్రైన్లు ట్రైల్స్‌కి 2025నాటికే సిద్ధంకానున్నాయి.  ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ వందే భారత్‌ రైళ్లను భారత ప్రభుత్వం తెస్తోంది. భారతీయ రైల్వేశాఖ ప్రకారం 400 వందే భారత్‌ రైళ్లను తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు భారతీయ రైల్వే మార్చిలో తెలిపింది.